Politics

ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించే ప్రసక్తే లేదు: మంత్రి సురేష్

ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించే ప్రసక్తే లేదు: మంత్రి సురేష్

ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. అయితే స్కూళ్లకు సెలవుల పెంపుపై సోమవారం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇంతలోనే పాఠశాలలకు సెలవులు పొడగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు ఇప్పటికే 13.87శాతానికి చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. స్కూళ్లను కొనసాగిస్తే కరోనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగం పెంచింది. కేసులు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసులు కూడా రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లు తెరిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థలకు విద్యాశాఖ సూచించింది.