BusinessNRI-NRT

పన్ను వసూలు చేయాలని కుబేరుల డిమండ్

పన్ను వసూలు చేయాలని కుబేరుల డిమండ్

ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్ నుంచి అసాధరణ లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 102 మంది కుబేరులు తమపై సంపదపై మరింత పన్ను విధించాలని, తద్వారా అసాధారణంగా పెరిగిపోయిన ఆర్థిక అసమానతలు తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పన్ను విధానం ఏమంత న్యాయసమ్మతంగా లేదని, ఫలితంగా విశ్వాసం కోల్పోతోందని అన్నారు. ‘‘ప్రపంచం గత రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కానీ, మహమ్మారి సమయంలోనూ మా సంపద గణనీయంగా పెరిగిందని చెప్పగలం. పన్నుల్లో మా న్యాయమైన వాటాను చెల్లించగలమని మేం చెప్పగలం’’ అని ఆ లేఖలో ప్రపంచ సంపన్నులు పేర్కొన్నారు. ఈ కుబేరుల గ్రూపులో మూడు సంస్థలు ఉన్నాయి. ఇందులో ఒకటి అమెరికాకు చెందిన పాట్రియోటిక్ మిలియనీర్స్ కాగా, రెండోది జర్మనీకి చెందిన ట్యాక్స్ మి, డెన్మార్క్‌కు చెందిన మిలియనీర్స్ ఫర్ హ్యుమానిటీ మూడోది.
గ్రూపు సభ్యుల్లో డిస్నీ వారసురాలు అబిగెయిల్ డిస్నీ, ఆమె సోదరుడు టిమ్ డిస్నీ, అమెజాన్ గత ఇన్వెస్టర్ అయిన నిక్ హనౌర్ కూడా ఉన్నారు. ఈ లేఖపై యూఎస్, యూకే, కెనడా, జర్మనీ తదితర 9 దేశాలకు చెందిన వారు సంతకం చేశారు. ధనవంతులు పన్నుల్లో తమ న్యాయమైన వాటాను చెల్లించాలని అన్ని దేశాల ప్రభుత్వాలు డిమాండ్ చేయాలని ఆ లేఖలో కోరారు. ‘ధనవంతులమైన మాపై పన్ను విధించండి.. ఇప్పుడే ఆ పని చేయండి’’ అని డిమాండ్ చేశారు. అయితే, ఈ లేఖలో పన్ను పెంపుదలకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రతిపాదనలు సూచించలేదు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారంపై చర్చించేందుకు ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వర్చువల్‌గా సమావేశమైన వేళ ఈ లేఖ విడుదల కావడం గమనార్హం. కాగా, ఐరోపా, దక్షిణ అమెరికాలోని చాలా దేశాల్లో సంపద పన్ను లేదు. ఈ నేపథ్యంలో అసమానతల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు సంపదపై పన్ను విధించాలని గతేడాది ప్రపంచబ్యాంకు సూచించింది.కరోనా మహ్మమారి తర్వాత అర్జెంటినా, కొలంబియా మాత్రమే కొత్తగా సంపద పన్ను విధానాన్ని తీసుకొచ్చాయి. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రపంచంలోని పది మంది సంపన్నుల సంపద రెండింతలై 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు సోమవారం ‘ఆక్స్‌ఫామ్’ వెల్లడించింది.