Politics

వైకాపా నుండి రాజ్యసభ అభ్యర్థులు వీరేనట

వైకాపా నుండి రాజ్యసభ అభ్యర్థులు వీరేనట

*బీసీ కోటాలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి బీద మస్తాన్ రావు కు అవకాశం?
*గుంటూరు జిల్లా నుంచి మరొకరిని రాజ్యసభకు
*అధికార పార్టీ లో పోటీ తీవ్రతరం

అధికార పార్టీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ మొదలైంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు వి.విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ ప్రభులు. జూన్‌ 21తో వీరి పదవీకాలం ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది.

*అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు
 విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్థానంతో పాటు మిగిలిన మూడు కూడా వైకాపాకే దక్కనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. విజయసాయిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ వైసీపీ లో ఉంది. మిగిలిన మూడు స్థానాల్లో రెండు తమ సొంత పార్టీ నేతలకు, ఒకటి ఉత్తర భారతదేశానికి చెందిన కార్పొరేట్‌ దిగ్గజానికి ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు పార్టీ నేతల్లో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు, మరొకరు గుంటూరు జిల్లాలో మూడేళ్ల నుంచి ఏ అవకాశమూ దక్కని సీనియర్‌ నేత అని వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడిని గత వారం ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్యసభకు పంపే అవకాశంపై చర్చ జరిగినట్లు సమాచారం తెలిసింది. బీద మస్తాన్‌రావుకు బీసీ కోటాలో అవకాశం ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నాలుగు స్థానాల్లో ఒకటి ఎస్సీ లేదా మైనారిటీకి ఇవ్వవచ్చన్న వాదన కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. అయితే నలుగురు అభ్యర్థుల తుది వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.