NRI-NRT

ప్రవాస నర్సుపై కువైత్ కోర్టు సీరియస్..

ప్రవాస నర్సుపై కువైత్ కోర్టు సీరియస్..

ప్రవాస నర్సుపై కువైత్ ఉన్నత కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విషయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రపంచ వ్యాప్తంగా దశల వారీగా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కొవిడ్ ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు రూపొందించి.. ప్రయాణ ఆంక్షలను అమలు చేశాయి. తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత తమ దేశంలోకి అడుగుపెట్టే ప్రయాణికులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశాయి. కువైత్ కూడా ఈ రూల్స్‌నే ఫాలో అయింది. ఈ క్రమంలోనే కువైత్‌లోని ఓ ఆసుపత్రిలో పని చేస్తున్న ఈజిప్టియన్ నర్సు అక్రమాలకు పాల్పడింది.

వ్యాక్సిన్ తీసుకోకపోయినా తీసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్‌ను రూపొందించి తోటి ఈజిప్టియన్‌కు అందించింది. కొద్ది రోజుల తర్వాత ఆ నర్సు చేసిన పని బయటపడింది. దీంతో అక్కడి అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కింద స్థాయి కోర్టు.. నర్సుకు 4ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సదరు నర్సు ఉన్నత స్థాయి న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. తాజాగా కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు.. కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నర్సుకు 4ఏళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా ఫేక్ సర్టిఫికెట్ పొందిన వ్యక్తికి 7ఏళ్ల జైలు శిక్షతోపాటు భారీగా జరిమాన విధించింది.