ప్రయోగాత్మక కథాంశాలకు పెద్దపీట వేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక తాప్సీ. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ.సర్టిఫికెట్ పొందింది. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో తాప్సీ పరిశోధనాత్మక జర్నలిస్ట్గా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ‘ఇటీవల మహేష్బాబు చేతుల మీదుగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్కు మంచి స్పందన లభిస్తున్నది. తాప్సీ పాత్ర వైవిధ్యంగా సాగుతుంది. దావూద్ ఇబ్రహీం అనే క్రిమినల్ను పట్టుకునే క్రమంలో ఆమె చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది.