ఇండియన్ స్ర్కీన్ పై ఇంతవరకూ రాని ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. మనిషి చర్మం వలిచి బిజినెస్ చేసే ఓ గ్యాంగ్తో పోరాటం చేసే యువతిగా హన్సిక ఈ చిత్రంలో నటించారు. శ్రీనివాస్ ఓంకార్ ఈ సినిమాకు దర్శకుడు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ‘రెప్పవేసే లోగా మారిందేమో నా రాత.. తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట’ అంటూ సాగే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటకు మార్క్ రాబీన్ సంగీతదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ‘ఇలాంటి పాత్రలో నేను ఎప్పుడూ నటించలేదు. సినిమాలో ఉండే ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అన్నారు. ‘సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ, ముగింపు వరకూ ఊహించని ట్విస్టులతో సినిమా ఉంటుంది’ అని చెప్పారు దర్శకుడు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామాన్నారు నిర్మాత. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాశ్, ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్ , పూజా రామచంద్రన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.