నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శోభాయాత్ర, విమాన గోపురాలకు పవిత్ర జలాలతో అభిషేకం, ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో నమో నారసింహ మంత్రం ప్రతి ధ్వనించింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న ఆలయ ఈవో ఎన్ గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, స్థపతి సుందర్ రాజన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించి, సన్మానించారు. ఆర్కిటెక్చర్ మధుసూదన్, ఈఎన్సీ రవీందర్ రావు, గణపతిరెడ్డి, శంకరయ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి, జీ వసంత్ నాయక్, వై లింగారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రామారావు, సుధాకర్ తేజలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాలువాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ శాలువాతో సత్కరించి, నారసింహ స్వామి ఫోటోను బహుకరించారు.
1. ‘మల్లన్న క్షేత్రం’లో ముగిసిన అగ్నిగుండాలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2. భక్తజన సంద్రంగా దక్షిణ కైలాసం
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో వేకువజాము నుంచే క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం 4.30 నుంచి 6గంటల రాహుకాల సమయంలో మరింత రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వాహనాలు అత్యధికంగా రావడంతో సన్నిధివీధిలో పార్కింగ్ సమస్య ఏర్పడింది. ముక్కంటి ఆలయ సమీపంలోని జలవినాయక స్వామి ఆలయం నుంచి టూరిస్టు బస్టాండు వరకు రోడ్డు ఇరుకుకావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. మొత్తంగా ఆదివారం సుమారు 30వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రాహుకేతు పూజలు 5,182మంది జరుపుకున్నారు. రూ.200 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 2,790, రూ.50 దర్శనం టిక్కెట్లు, 3,783 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా రూ.41లక్షల ఆదాయం ఆలయానికి చేకూరింది.
3. వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం నాడు భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట రద్దీగా మారింది. స్వామివారి సర్వదర్శనం, శీఘ్రదర్శనం, కోడెమొక్కుల క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. ఆదివారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. కళాభవన్లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ వంటి ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
4. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మఽథరావు తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుం బ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
5. కర్నూలులోని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునుడిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులు ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. అనంతరం, వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్టర్ కోటేశ్వరరావు, ఈవో లవన్న స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. పూజల అనంతరం, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుని మోడల్ రూమ్ను సందర్శించారు. అనంతరం వారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి అమ్మవార్లను ఆదివారం దర్శించుకున్నారు. త్రిపురాంతకేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చినమస్తాదేవికి పూజలు, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అర్చకులు, ఆలయ అధికారులు జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులకు తీర్థప్రసాదాలుశేషవస్త్రాలను అందజేశారు.
6. సర్వదర్శన టైం స్లాటెడ్ భక్తులకు రెండోరోజు దర్శనం
టైం స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు తీసుకున్న భక్తులకు వేంకటేశ్వర స్వామి దర్శనం రెండో రోజు లభిస్తోంది. శ్రీవారి ఆలయంలో ఈ నెల 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో పాటు వారాంతపు రద్దీ దృష్య్టా భక్తులకు సర్శదర్శనానికి మరుసటి రోజు కాకుండా రెండోరోజు దర్శనం లభిస్తున్నట్టు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మరింత ఎక్కువ మందికి దర్శనం కల్పించే దిశగా ఈ నెల 29న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా 28వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలు తీసుకోబోమని టీటీడీ స్పష్టం చేసింది
7. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి ఎన్ని నెలలు పట్టిందో తెలుసా?
తిరుమల తిరుపతి తరహాలో యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారు. నేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ్మా స్వామి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. మరి ఆలయ పునర్నిర్మాణానికి ఎన్ని నెలలు పట్టింది.. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ఎంతమంది శిల్పుల శ్రమ ఉంది. ఆలయానికి ఎన్ని టన్నుల కృష్ణశిల వాడారు? ఎంతమంది గుత్తేదారులు పని చేశారనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..2016, అక్టోబర్ 11న విజయదశమి నాడు యాదాద్రీశుడి ఆలయం పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఆలయానికి వాడిన రాయి(కృష్ణశిల) రెండున్నర లక్షల టన్నులను గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల నుంచి సేకరించారు. ఆలయ పునర్నిర్మాణంలో 800 మంది శిల్పులు, 8 మంది గుత్తేదారులతో పాటు 1500 మంది కార్మికుల కష్టం ఉంది. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు 66 నెలల పాటు కొనసాగాయి. ప్రధానాలయంలో 6 వేలకు పైగా శిల్పాలను శిల్పకారులు తయారు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను రూ. 2 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. యాదాద్రి ప్రధానాలయ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దేశంలోనే ప్రథమంగా ఆలయమంతా కృష్ణశిలతో నిర్మించారు. గిరి ప్రదక్షిణకు కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల మేర వలయ రహదారి నిర్మించారు.
8. యాదాద్రి గర్భాలయంలోకి ఉత్సవమూర్తులు
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం పూర్తి అయ్యింది. అనంతరం ఉత్సవ మూర్తులను యాదాద్రి గర్భాలయంలోకి చేర్చారు. స్యయంభువు లక్ష్మీనరసింహ స్వామికి మొదటి పూజ, మహానివేదన, మొదటి తీర్థ ప్రసాదగోష్ఠిని వేద పండితులు సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా వేద ఆశీర్వచనం ఇచ్చారు.
9. యాదాద్రి బాలాలయం నుంచి శోభయాత్ర ప్రారంభం. పాల్లొన్న కేసీఆర్ దంపతులు..
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బాలాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది.స్వామి, అమ్మవార్ల యంత్రాలు, సువర్ణ ప్రతిష్ఠాలంకర మూర్తుల విగ్రహాలను వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ప్రధానాలయం వరకు శోభాయాత్ర మొదలైంది. శోభయాత్రలోసీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 11:55 గంటలకు మహా కుంభ సంప్రోక్షణలో 150 మంది రుత్వికులు పాల్గొననున్నారు.
10. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు
సింహాద్రి అప్పన్నను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వామపక్షాలు జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. విశాఖ సింహాద్రి అప్పన్నను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపద, స్థల పురాణం గురించి గవర్నర్కు మంత్రి అవంతి వివరించారు.స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని గవర్నర్కు మంత్రి అందజేశారు. అనంతరం పురోహితులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించారు. వామపక్షాలు జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
11. ఘనంగా ప్రారంభమైన అన్నమాచార్యుని వర్ధంతి మహోత్సవాలు
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుని 519వ వర్థంతి మహోత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల సంకీర్తనలతో.. అలిపిరి మార్గం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.తాళ్లపాక అన్నమాచార్యుని 519వ వర్థంతి మహోత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అలిపిరి మెట్ల మార్గం వద్ద సంప్రదాయ మెట్లోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పండితులు ఉత్సవాలను ప్రారంభించారు. మెట్లోత్సవ కార్యక్రమంలో తితిదే జేఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భజన బృందాలు, అన్నమాచార్య ప్రాజెక్ట్లోని కళాకారుల సంకీర్తనలతో అలిపిరి మార్గం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.