DailyDose

భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు

భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు

భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. “జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష” పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన సమగ్ర సర్వే వివరాలను అధికారులు సీఎంకు అందించారు. అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి.. గతంలో వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యంత్రి జగన్ స్పష్టం చేశారు. “జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష” పథకంపై సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం.. సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలన్నారు. ఈ సందర్భంగా సమగ్ర సర్వే వివరాలను అధికారులు సీఎం​కు అందించారు. భూసర్వే కోసం అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన డ్రోన్‌ను సీఎం పరిశీలించారు.ఇప్పటి వరకూ 1441 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మరింత వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 5 కల్లా భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమై ఉంటాయన్నారు. మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామన్నారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్‌ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. రెవిన్యూ విలేజ్‌ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వెబ్‌ ల్యాండ్‌ అప్‌డేషన్, గ్రామ ల్యాండ్‌ రిజిస్టర్‌ అప్‌డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం ఇవ్వనున్నట్లు అధికారులు సీఎం జగన్​కు వివరించారు.గ్రామ సచివాలయాల వారీగా భూ వివరాలను అప్‌డేషన్‌ చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల గతంలో వెబ్‌ల్యాండ్‌ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం వస్తుందన్నారు. 2023 జులై నెలాఖరు వరకు 5,200 గ్రామాల్లో, 2023 ఆగస్టు నెలాఖరు కల్లా 5,700 గ్రామాల్లో, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేలా కార్యాచరణ పూర్తిచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌.. ఓఆర్‌ఐ చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబరు నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబరు నెలాఖరు నాటికి, మూడోవిడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని సీఎంకు వివరించారు.

గతంలో వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ప్రక్రియ జరగాలన్నారు. రికార్డులను ఎవరూ మార్చలేని విధంగా, టాంపర్‌ చేయలేని విధంగా చేయాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్‌ రికార్డులనూ తయారుచేయాలన్నారు. ఫిజికల్‌ డాక్యుమెంట్‌ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. సబ్‌ డివిజన్‌ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని సీఎం అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
“గతంలో వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. ఎలక్ట్రానిక్‌లోనే కాకుండా ఫిజికల్‌ రికార్డులు తయారుచేయాలి. ఫిజికల్‌ డాక్యుమెంట్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. సబ్‌ డివిజన్‌ కోసం దరఖాస్తు పెట్టగానే సర్వే జరిగేలా చూడాలి. సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి.” -జగన్, ముఖ్యమంత్రిభూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయటం ద్వారా.. స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయని సీఎం జగన్ అన్నారు. భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చే నాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో న్యాయశాఖనూ భాగస్వామం చేయాలన్నారు. భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో దేశానికి ఒక దిక్సూచిగా రాష్ట్రం నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్​ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు