Kids

జీవిత సత్యాన్ని తెలిపే కస్తూరి మృగం కథ

జీవిత సత్యాన్ని తెలిపే కస్తూరి మృగం కథ

ధ్యానానికి మించిన తీర్ధయాత్ర లేదు !!

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపు వాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలు పెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.
మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి ‘నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.’ అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.
అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.
‘అదేంటి బావా? ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని వారు అడుగుతారు.
దానికి కృష్ణుడు నవ్వి.’ బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?’ అంటాడు.
ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.
మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు. అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు. తపస్సు అంటేనే ధ్యానం . ధ్యానం ద్వారానే జ్ఞానసిద్ధిని పొందారు…..

వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని “ఖాళీ”గా నిలబడ్డారు.
అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి “ఖాళీ”గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో “ఖాళీ”గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
ఒకరు గురువుగారిని అడిగారు దైవీశక్తిని నేను చవిచూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి గురువుగారు ఇలా చెప్పారు-
500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు….అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.
ప్రత్యక్షానుభవం కలుగుతుంది.
కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని *చేయడం వలన కలుగుతుంది…అన్నారు.

అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ, ప్రయత్నం చేయలేకపోయాడు.
ఈ ఘట్టం విని అతని స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.
అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్షం చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా
ప్రయత్నం చేసి దైవీశక్తిని అనుభవించాడు.
తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు..
కొందరు “అతడు పిచ్చివాడైపోయాడు” అని దూరమైపోయారు…
కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు.
అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.