NRI-NRT

సింగపూర్ లో శ్రీమద్ భాగవత సప్తాహం

సింగపూర్ లో శ్రీమద్ భాగవత సప్తాహం

సింగపూర్ లో దిగ్విజయంగా ప్రారంభమైన “శ్రీమద్ భాగవత సప్తాహం”

సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై నిర్వహింపబడుతున్న,
“శ్రీమద్ భాగవత సప్తాహం” కార్యక్రమం మొదటి రెండు రోజులు దిగ్విజయంగా సుసంపన్నం అయ్యాయి. పంచ మహా సహస్రావధాని, అవధాన సామ్రాట్ డా. మేడసాని మోహన్ గారు, శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సింగపూర్ తెలుగు వారి కోసం వారంరోజుల పాటు అందిస్తున్న ఈ భాగవత ప్రవచన కార్యక్రమ ప్రారంభోత్సవంలో శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విధుశేఖరానంద భారతి స్వామి వారు మరియు కుర్తాళం పీఠాధిపతిలు శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు కార్యక్రమానికి తమ తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ఆశీస్సులను వీడియో సందేశం రూపంలో అందించారు, ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మరియు బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొని సభకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

బిజెపి రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాజు వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డా. వంశీ రామరాజు, అమెరికా నుండి మల్లిక్ పుచ్చా, ఆస్ట్రేలియా నుండి విజయ తంగిరాల, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, థాయిలాండ్ నుంచి రవికుమార్ బొబ్బ, మలేషియా నుండి డా అచ్చయ్య రావు, సౌదీ అరేబియా నుండి దీపిక రావి తదితరులు, భారత్ నుండి తెలుగు భాగవత ప్రచార సమితి అధ్యక్షుడు ఊలపల్లి సాంబశివరావు దంపతులు మరియు వివిధ దేశాల తెలుగు ప్రతినిధులు పాల్గొన్నారు.

మొదటిరోజు భాగవత నేపథ్యం మరియు ఆవిర్భావాన్ని గురించి రెండవ రోజు మత్స్య కూర్మ వరాహ అవతార విశేషాలను గూర్చి డా. మేడసాని ప్రసంగించారు. కథా విశేషాలతో పాటు పోతన రచనా వైశిష్ట్యం గురించి మరియు జీవితంలో మనకు ఉపయోగపడే విధంగా భాగవత కథలు నుండి మనము నేర్చుకోవలసిన అంశాలను గురించి కూడా మాట్లాడుతూ కళ్ళకు కట్టినట్లు భాగవతాన్ని వారు అభివర్ణించారు.

రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, నీలం మహేందర్ ఊలపల్లి భాస్కర్, రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప, శ్రీనివాస్, సుబ్బు వి పాలకుర్తి, రామాంజనేయులు చామిరాజు తదితరులు డాక్టర్ మేడసాని కి ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుండి తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవసిన ఆవశ్యకత ఉందని, తమ కార్యక్రమాన్ని తప్పక వీక్షించమని ఆహ్వానించారు.

రాధికా మంగిపూడి సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించగా, గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణలో ప్రతిరోజూ ఏడు మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది.