‘జెర్సీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు శ్రద్ధా శ్రీనాథ్. ఆ తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో మరింత గుర్తింపు పొందారు. ఆచితూచి కథలు ఎంపిక చేసుకునే ఆమె దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిగా బిజీగా ఉన్నారు. తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్న ఆమెకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇటీవల ఆమె ఓలా క్యాబ్లో ప్రయాణించారు. అందులో డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే డ్రైవర్ నిరాకరించాడు. ‘‘పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేయడానికి నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు సేవ్ చేయడానికే అతను అలా చేశాడని నాకు అర్ధమైంది. అందుకే ఏమీ అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ళ సంపాదనను దోచుకుంటోంది’’ అని పేర్కొన్నారు.
దీనితోపాటు ఎయిర్పోర్ట్లో ఎదురైన మరో వింతను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. ‘ఎయిర్పోర్ట్లో శ్రద్ధాను చూసిన ఓ మహిళ నన్ను ‘జెర్సీ’ సినిమా హీరోయిన్గా గుర్తుపట్టారు. అయితే ఆమెకు నా పేరు గుర్తు లేదు. నన్ను శ్రద్ధా దాస్ అని పిలవడంతో అవాక్కయ్యాను. అది నా పేరు కాదని, నా పేరు శ్రద్ధా అని చెప్పాను. అయినా కానీ ఆమె ‘అవును. శ్రద్థా! శ్రద్థా దాస్’ అని అనడంతో ‘కాదు. ఆమె వేరు.. నేను వేరు.. నేను శ్రద్థా శ్రీనాథ్’ అని చెప్పాను. ఆఫ్ కోర్స్. మిమ్మల్ని నేను ఎలా మరచిపోగలను’’ అంటూ వెళ్లిపోయిందామె. కూల్ అనుకుంటూ నేను వెళ్లిపోయా. కొన్ని సంఘటనలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి’’ అని శ్రద్ధా శ్రీనాథ్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు.