Devotional

గణపతి ముందు… గుంజీళ్ళు ఎందుకు తీయాలి? – TNI ఆధ్యాత్మికం

గణపతి ముందు… గుంజీళ్ళు ఎందుకు తీయాలి? – TNI ఆధ్యాత్మికం

పార్వతీదేవి, శ్రీమహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. ‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’ అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు.’ఇంకెక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా!’ అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అందువల్ల ‘బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా’ అని నానారకాలుగా బ్రతిమాలాడు విష్ణువు. గణపతి పట్టువదల్లేదు.ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పించేంతగా నవ్వాడు.ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది.

2. రామయ్యకు గోటి తలంబ్రాల సమర్పణ
భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో భక్త బృందం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చెల్పూరుకు చెందిన రామదాసు భక్త మండలికి చెందిన రెండు వేల మంది సభ్యులు సోమవారం రాత్రి భద్రాచలం చేరుకొన్నారు. మంగళవారం ఉదయం గోదావరిలో పవిత్ర స్నానమాచరించారు. అనంతరం వారు గోటి తలంబ్రాలను ఆలయ అధికారులకు సమర్పించారు. సుమారు మూడు క్వింటాళ్ల తలంబ్రాలు సేకరించినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ తలంబ్రాలనే శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో వినియోగిస్తామని చెప్పారు. ఉచిత అన్నదాన కార్యక్రమం కోసం కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు స్వయంగా పండించిన 25 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బానోతు శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, వేద పండితులు పాల్గొన్నారు