Politics

బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. వారికి టికెట్లు రావు!- TNI రాజకీయ వార్తలు

బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. వారికి టికెట్లు రావు!- TNI రాజకీయ వార్తలు

* ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునేవారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడైనప్పటికీ.. తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. రెండు విడత పాదయాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకోసం కష్ట పడిన వారికే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వస్తాయని అన్నారు.వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావని స్పష్టం చేశారు. టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు.. నాయకులను తిప్పుకుంటున్నారని అన్నారు. తిప్పుకున్న వారికీ.. తిరిగిన వారికీ ఇద్దరకీ టికెట్లు రావని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ కూడా ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరని, అధ్యక్షుడైనప్పటికీ తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని అన్నారు. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్నవారికే టికెట్ రాలేదని గుర్తుచేశారు.

*సీఎం కేసీఆర్‌ లేని సమస్యను సృష్టిస్తున్నారు: కిషన్‌రెడ్డి
ధాన్యం కొనుగోలుపై రైతులను టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మంళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దీక్ష చేసినా రైతులు పట్టించుకోవడం లేదని అన్నారు. బాయిల్డ్ రైస్‌ ఇవ్వబోమని కేసీఆర్‌ లేఖ ఇచ్చారా? లేదా? చెప్పాలన్నారు. బాయిల్డ్‌ రైస్‌ ఎవరూ తినడం లేదని తెలిపారు. బాయిల్డ్‌ రైస్‌ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసిందని గుర్తుచేశారు. ‘రా రైస్‌’ తీసుకోవడానికి కేంద్రం ఇప్ప టికీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ లేని సమస్యను సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని సీఎం కేసీఆర్‌ లేఖ ఇచ్చారని అన్నారు.గత సీజన్‌ గురించి తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం చివరి గింజవరకు కొంటామని తెలిపారు. గత సీజన్‌లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వాలని మాత్రమే చెప్పామని అన్నారు. లేని వడ్ల సమస్యను ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎవరూ ఉప్పు డు బియ్యం తినడం లేదని, ఉపయోగం తగ్గిందని తెలిపారు. కేంద్రం వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకుపోయాయని అన్నారు. ఉచితంగా ఇచ్చినా తీసుకోవడం లేదని తెలిపారు. రైతులను టీఆర్‌ఎస్‌ భయపెడుతోందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు: స్పీకర్‌ తమ్మినేని
ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం జరిగిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద మానవతావాది అని స్పీకర్‌ కొనియాడారు.కేబినెట్‌లో అణగారిన వర్గాలకు సీఎం జగన్‌ గొప్ప అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బీసీలకు దామాషా పద్దతిన పెద్ద ఎత్తున రాజాధికారం ఇచ్చారని తెలిపారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్దిదారుల ఇంటి వద్దకే చేరుస్తున్నారని తెలిపారు. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని అన్నారు. కేబినెట్‌లో అందరికీ సమాన న్యాయం జరిగిందని స్పీకర్‌ పేర్కొన్నారు.

*అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తాం: సీపీఐ నేత రామకృష్ణ
అధిక ధరలకు వ్యతిరేకంగా రేపు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ధరలకు వ్యతిరేకంగా రేపు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శ కె. రామకృష్ణ తెలిపారు. 15వ తేదీన పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని ఆయన వెల్లడించారు. పెరిగిపోతున్న ధరలను వ్యతిరేకిస్తూ ప్రచార కార్యక్రమాన్ని వాడవాడలా తాము నిర్వహిస్తున్నామని వివరించారు. విశాఖలో పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో రామకృష్ణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

* వైవీ సుబ్బారెడ్డిపై లోకేష్ విమర్శలు
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. లాభాలు, జే ట్యాక్స్ లెక్కేసుకోవ‌డానికి వైవీ సుబ్బారెడ్డీ టీటీడీ మీ సూటుకేసు కంపెనీ కాదని లోకేష్‌ మండిపడ్డారు. ఆప‌ద మొక్కుల‌వాడి చెంత‌కొచ్చేవారిని ఆప‌ద‌లోకి నెట్టేసింది మీరు కాదా? అని లోకేష్‌ ప్రశ్నించారు. వంద‌ల ఏళ్ల తిరుమ‌ల చ‌రిత్రలో ఎన్నడూ లేనంత‌గా.. అంద‌రివాడు గోవిందుడిని సామాన్యుల‌కి అంద‌నివాడిగా చేశారని లోకేష్‌ విమర్శించారు. శ్రీవారి సేవ‌లు, టికెట్లు, ప్రసాదం ధరలను మూడింత‌లు పెంచ‌డంపైనే మీకు ఆరాటమని లోకేష్‌ అన్నారు.

* 2024 ఎన్నికల కోసం పనిచేస్తాం: పిన్నెల్లి
సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ అంటే నేను, నేను అంటే నా పార్టీ అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 2009లో రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బి ఫామ్ తీసుకున్నామని, తర్వాత 3 సార్లు జగన్ చేతులు మీదుగా తీసుకున్నానని ఆయన అన్నారు. నిన్నటి నుంచి అసంతృప్తి అని వస్తున్న వార్తలు నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాంబర్ లో కి వెళ్తున్నారని తెలిసి వచ్చానని ఆయన అన్నారు. అనుచరులు రాజీనామా చేశారు అనేది అనుకోకుండా ఆవేశంలో జరిగిందని, కార్యకర్తలకు ఆశ ఉంటుందని, వెంటనే వారికి విషయం వివరించానని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తమ లక్ష్యం 2024 ఎన్నికలు.. దానికోసం పనిచేస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

*ప్రజల సమస్యలపై బుల్డోజర్ నడపాలి : రాహుల్ గాంధీ
ప్రజల సమస్యలను పరిష్కరించాలని, విద్వేషాన్ని వ్యాపింపజేయవద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీకి హితవు పలికారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజల సమస్యలపై బుల్డోజర్‌ను నడపాలన్నారు. బీజేపీ బుల్డోజర్‌లో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సమస్యలపై నుంచి బుల్డోజర్‌ను నడపాలన్నారు. బీజేపీ బుల్డోజర్‌లో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయన్నారు. మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హింసాకాండ చెలరేగింది. శోభాయాత్రపై కొందరు దుండగులు దాడి చేయడంతో విధ్వంసం జరిగింది. దాదాపు ఏడుగురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. ఇళ్లు, వాహనాలను తగులబెట్టారు. ఆది, సోమవారాల్లో ఈ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టాన్ని దుండగుల నుంచే వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనలో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది.

* సీఎం జగన్‌తో ముగిసిన అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ
సీఎం జగన్‌తో అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కొందరు నేతలు మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాకపోవడం తమ కార్యకర్తలను బాధించిందని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. బలహీన వర్గాలకు సీఎం ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారని పార్థసారధి తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వల్ల తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆశించానని సామినేని ఉదయభాను అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో పార్టీని అధికారంలోకి తేవాలని సీఎం కోరారని చెప్పారు.

*చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు..: కోమటిరెడ్డి
వరి ధాన్యం కొనుగోలు‌కు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలని.. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎంపీ , స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు.. చంద్రబాబు కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది. మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరు…మేము నిరసనలు చేస్తే..అరెస్ట్‌లు చేయిస్తున్నారు. దేవుడు దయతో వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటుంన్నారు. ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంన్నారు.. ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

*బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌పై బాంబు దాడి
బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై మంగళవారం బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన పాల్గొన్న జనసభపై ఓ దుండగుడు బాంబు విసిరాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే..వేదికకు పదిహేను నుంచి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్‌ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. పాట్నా భక్తియార్‌పూర్‌లో ఈ మధ్యే బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. మానసిక స్థితి సరిగా లేని స్థానిక నివాసిగా భావిస్తున్న దుండగుడిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు.

* బండి చస్తే రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇప్పిస్తాం : ఎమ్మెల్సీ ప‌ల్లా
రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చావాల‌ని కోరుకోవ‌డం లేదు.. కానీ ఆయ‌న చ‌స్తే రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇప్పిస్తామ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నిన్న ఢిల్లీలో చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష విజ‌య‌వంత‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ ధ‌ర్నా త‌ర్వాత ఎఫ్‌సీఐ అధికారి తెలుగు మీడియాతో మాట్లాడారు. పీఎంవో ఆదేశాల‌తోనే త‌మ‌కు దీక్ష‌కు పోటీగా బీజేపీ హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేప‌ట్టింద‌ని ప‌ల్లా నిప్పులు చెరిగారు.

*చెక్క భజన మంత్రులు అవుతారనుకోలేదు: శైలజానాథ్
ఏపీ మంత్రి వర్గంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డమ్మీ మంత్రులే అనుకున్నాం, కానీ ఇలా చెక్క భజన మంత్రులు అవుతారనుకోలేదని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. నాలుగో స్తంభమైన మీడియాను అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని, తక్షణమే జర్నలిస్టులకు మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి డమ్మీలతో సీఎం జగన్ చెక్కభజన చేయించుకుంటున్నారని శైలజానాథ్ విమర్శించారు.మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యలుజర్నలిస్టుల సమస్యలు తీరాలంటే సీఎం జగన్నుశ ఆరాధించాలి కానీ ఆరా తీయొద్దంటూ సలహాలిచ్చారు. ఆరాతీయడమే తమ ఉద్యోగమని జర్నలిస్టులు పేర్కొన్నారు. దీనిపై మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్నుజ ఆరాధించాను కాబట్టే నాకు మంత్రి పదవి వచ్చింది. చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల నెరవేరుతుంది’’ అని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను పలువురు జర్నిలిస్టులు తప్పుబడుతున్నారు.

*పార్టీ కోసం ఆయన ఎంతో చేశారు: మాజీ మంత్రి అనిల్
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సమన్వయకర్త అని, పార్టీ కోసం ఆయన ఎంతో చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియోజకవర్గంలోకి ఆహ్వానిస్తానన్నారు. కుటుంబంలో గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి తనకు ఇచ్చిన గౌరవంలో తాను రెండింతలుగా గౌరవిస్తానన్నారు. ప్రమాణస్వీకారానికి మంత్రి కాకాణి తనకు ఆహ్వానం పంపలేదన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తానే హీరో అని చెప్పుకుంటున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆ పార్టీ 30 లేదా 40 సీట్లకు పోటీ చేస్తుందని, ఎమ్మెల్యేగా టీడీపీ, జనసేనతో పోరాటం కొనసాగిస్తానన్నారు. నెల్లూరు పెన్నా బ్యారేజీని వచ్చే నెలలోనే ప్రారంభిస్తామన్నారు. సంగం బ్యారేజీ, పోలవరం విషయం తనది కాదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

*సీఎం జగన్‌తో ఆ విషయం చెప్పా: బాలనాగి‌రెడ్డి
మంత్రి పదవి అవసరం లేదు.. నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి అన్నారు. మంగళవారం వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను మంత్రిగా ఉంటే నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడపలేను, ప్రజల సమస్యలను గుర్తించలేను. సీఎం జగన్ తో నేను ఒక్కటే చెప్పాను పులికనుమ, ఆర్డీఎన్, ప్రాజెక్టు, 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడిగా. నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కోరిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలని కోరా. నేను కోరిన వెంటనే జీఓ విడుదల చేశారు’’ అని ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి తెలిపారు.

*జగన్‌‌కు నేను సమస్య కాకూడదు: స్పీకర్ తమ్మినేని
తానేప్పుడూ ఎటువంటి పదవులు ఆశించలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్‌కు తాను సమస్య కాకూడదు… ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. రేపు జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం ప‌ని చేయమన్నా… వెళతానని స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారని చెప్పారు. అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయన నిర్ణయాలు ఉంటాయన్నారు. స్పీకర్‌గా ఉండాలని తనకు చెప్పడానికి కూడా అప్పుడు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. తనకు ఎటువంటి ఇబ్బంది లేదు సర్… అని చెప్పి బాధ్యత తీసుకున్నానని అన్నారు. మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందన్నారు. అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అందరికీ సమామమైన న్యాయం‌ చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 133కార్పొరేషన్లలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

*కేసీఆర్ విషప్రచారం విచిత్రంగా ఉంది: కిషన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ వైఖరి, వితండవాదం, విషప్రచారం చాలా విచిత్రంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘‘వ్యవసాయ మోటార్లకు కేంద్రం మీటర్లు పెడుతుంది అంటూ నానా హంగామా చేశారు.మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రైతులు కూడా అర్ధం చేసుకున్నారు.వడ్ల విషయంలో లేని సమస్యను ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోము అంటూ రాసిచ్చిన మాట నిజమా కాదా?? బాయిల్డ్ రైస్ తినే రాష్ట్రాల్లో వినియోగం తగ్గింది. మిగతా ఎక్కడా తినడం లేదు. ఉచితంగా ఇచ్చినా సరే, తినే పరిస్థితి లేదు. కేవలం తెలంగాణలోనే కాదు, బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలను కూడా ఇకపై వద్దని కేంద్రం కోరుతూ వచ్చింది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

*కేశినేనేని వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి రాజధానికి కృష్ణా నదిపై 3.5 కి.మీ భారీ వంతెన నిర్మాణానికి ఎంపీ కేశినేని నాని ప్రతిపాదన చేశారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాజధాని అమరావతిని అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసేలా చట్టంలో పెట్టారని కేశినేని నాని చెప్పారు. వంతెన నిర్మాణానికి చంద్రబాబు చర్యలు తీసుకున్నా…. జగన్‌ వచ్చాక పనుల్ని పూర్తిగా నిలిపివేశారని వ్యాఖ్యానించారు.

* జగన్‌కి భవిష్యత్తులో ప్రజలు పవర్ కట్ చేస్తారు : లంకా దినకర్
నేడు పరిశ్రమలకు పవర్ హాలిడే అని.. రేపు శాశ్వతంగా జగన్‌కి పవర్ హాలిడే తప్పదని బీజేపీ నేత లంకా దినకర్ పేర్కొన్నారు. ఆస్తి పన్ను బాదుడు జాస్తి కావడంతో జగన్ పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు. జగన్ విద్యుత్ బాదుడుకి రాష్ట్రంలో ఉన్న మిగిలిన కొన్ని పరిశ్రమలు పరారయ్యాయ. పవర్ చార్జీల ప్రభావం వల్ల జగన్‌కి భవిష్యత్తులో ప్రజలు పవర్ కట్ చేస్తారని లంకా దినకర్ పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను, తాగు, సాగు నీటి పన్ను, చెత్త మీద పన్ను బాదుడుతో ప్రజల నెత్తిన పిడుగు పడిందన్నారు. గృహ విద్యుత్ చార్జీల బాదుడు వల్ల ప్రజలు ప్రత్యక్షంగా, పారిశ్రామిక విద్యుత్ చార్జీల బాదుడు పెరిగి పరోక్షంగా రెండు భారాలు మోస్తూన్నారని లంకా దినకర్ పేర్కొన్నారు.

* గన్ కంటే ముందొస్తానంటూ సినిమా డైలాగ్స్ కొట్టిన జగన్ ఎక్కడ?: నారా లోకేష్జ
గన్ పాలనలో గజానికో వైసీపీ గాంధారి కొడుకు.. పుట్టుకొచ్చి మహిళల్ని వేధిస్తున్నాడని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో వైసీపీ సర్పంచ్ కన్నం శ్యామ్ బరితెగించి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ఫోన్‌లో వేధించాడన్నారు. అండగా నిలిచిన ఆమె స్నేహితుడు శ్రీనివాసరావు ఆత్మహత్యకు.. పాల్పడేలా పోలీసులతో కలిసి బెదిరించాడని నారా లోకేష్‌ పేర్కొన్నారు. వైసీపీ నేతలే మహిళల పట్ల కాలయముడిలా మారి కాటేస్తుంటే.. గన్ కంటే ముందొస్తానంటూ సినిమా డైలాగ్స్ కొట్టిన జగన్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

*ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారు: Komati reddy
వరి ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదని.. చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు. మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరని…మేము నిరసనలు చేస్తే..అరెస్ట్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. దేవుడు దయ వల్ల వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటుంన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకుంటుంన్నారని.. ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని కోమిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

*బుగ్గన క్షపూరితమైన రాజకీయాలను మానుకోవాలి: బీసీ జనార్దన్‌రెడ్డి
పరిశ్రమల నిర్వాహకులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డోన్ నియోజకవర్గంలో జరిగే మైనింగ్ దందాను ఆర్థికమంత్రి బుగ్గన అరికట్టాలని డిమాండ్ చేశారు. క్షపూరితమైన రాజకీయాలను బుగ్గన మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో విసనకర్రలు కొవ్వొత్తులు లాంతర్లకు డిమాండ్ పెరిగిందని బీసీ జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

*వేరు కుంపట్లతో కేసీఆర్‌ను ఢీకొట్టలేం: కోమటిరెడ్డి
సీనియర్లు, జూనియర్లు అనే భేదాలు లేకుండా అందరితో చర్చించి ముందుకు వెళ్తామని, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమితులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ టికెట్లపై గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలను ఓడించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పార్టీలోని పెద్ద నేతలందరం తలో వైపు వెళ్లి పనిచేస్తామన్నారు. కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే వేరు కుంపట్లు కాకుండా కలిసి పోరాటం చేయాలన్నారు. ఈ నెల 12 నుంచి వడ్ల కొనుగోలుపై ఆందోళనలు చేపడతామన్నారు. గ్రామాల్లో సభలు పెట్టి.. కేసీఆర్‌ దోపిడీని బయటపెడతామని స్పష్టంచేశారు. కుటుంబ పాలన వల్లే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని.. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో అదే పరిస్థితే రావొచ్చన్నారు.

*సుచరితతో జగన్‌ రాజీ పడాల్సిందే: వర్ల
‘‘రాష్ట్ర మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పట్ల సీఎం జగన్‌ కఠినంగా వ్యవహరించలేరు. ఆమెతో జగన్‌ రాజీ పడాల్సిందే’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్వీట్‌ చేశారు. ‘‘సుచరిత భర్త ఆదాయ పన్నుల శాఖలో ఓ పెద్ద అధికారి. గత 15 సంవత్సరాలుగా జగన్‌ ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా, లోతుగా తెలిసిన వ్యక్తి’’ అని వర్ల ట్వీట్‌ చేశారు.

*టీడీపీ డీఎన్‌ఏలోనే బీసీల అభివృద్ధి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ డీఎన్‌ఏలోనే బీసీ వర్గాల అభివృద్ధి ఇమిడి ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా సోమవారం ఆయన నివాళి అర్పిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘సమ సమాజ స్థాపనకు, విద్యావ్యాప్తికి, మహిళా సాధికారతకు తన జీవితం అంకితం చేసిన తొలి సమాజ సంస్కర్త జ్యోతిబా. టీడీపీ ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితో పుట్టింది. వెనుకబడిన వర్గాల్లో రాజకీయ చైతన్యం కలిగించి వారి సామాజిక ఆర్థిక రాజకీయ పురోగతికి 40 ఏళ్లుగా కృషి చేస్తోంది. బీసీలది, టీడీపీది విడదీయలేని అనుబంధం. టీడీపీ అంటేనే బీసీ వర్గాల పార్టీ’’ అని బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన, తనయుడు లోకేశ్‌ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

*అన్నదాతలను మోసం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు: షర్మిల
అన్నం పెట్టే అన్నదాతలను మోసం చేసిన ప్రతీఒక్కరు కాలగర్భంలో కలిసిపోతారని వైఎస్‌ఆర్‌‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హెచ్చరించారు. వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సోమవారం 52వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రంపై నెపం మోపుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విరుచుకపడ్డారు. గ్రామాల్లో మిర్చి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న బిడ్డగా నాకు అధికారం అందిస్తే తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చి గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తామని షర్మిల తెలిపారు.

*మిషన్ భగీరథ ఉన్నా నీళ్ల కోసం పరేషాన్: విజయశాంతి
టీఆర్‌ఎస్ సర్కార్‌పై తెలంగాణ బీజేపీ ఫైర్‌బ్రాండ్ విజయశాంతి మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో తాగు నీటి ఎద్దడి పరిస్థితులపై ఆమె స్పందించారు. ఎండాకాలంలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో తాగడానికి కడివెడు నీరు లేక ప్ర‌జ‌లు అల్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా ఆమె స్పందించారు. తాగేందుకు నీరు దొరక్క రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు అవ‌స్తలుప‌డుతున్నారనిపల్లెవాసులు శివార్లలోని బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ‌లో తాగునీటి సమస్య తీర్చేందుకు కేసీఆర్ స‌ర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. మిషన్‌ భగీరథ ఉన్నా… ప్రజలకు మాత్రం నీళ్ల కోసం పరేషాన్‌ తప్పడం లేదని విమర్శించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లోని 23,775 ఆవాసాల్లో 54,06,070 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని విజయశాంతి ఆరోపించారు. కొన్ని చోట్ల ఇంకా ప్రధాన పైపులైన్‌ పనులే పూర్తికాలేదని విమర్శించారు. ఇంకొన్ని చోట్ల పూర్తయినా ట్యాంకులు నిర్మించలేదని మండిపడ్డారు. మరికొన్ని చోట్ల ట్యాంకులు నిర్మించినా నీళ్లు రావడంలేదని విమర్శించారు. పలు ప్రాంతాల్లో నీరు వస్తున్నా నిర్వహణ లోపంతో పైపులు లీకవుతూ నీళ్లు వృథాగా పోతున్నాయని ఆమె విమర్శించారు. మరోవైపు నిధుల కొరతబిల్లుల్లో జాప్యంకాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ఆరోపించారు. నాణ్యతలేని పైపుల ఏర్పాటుప్రధానఅంతర్గత పైపులైన్ల లీకేజీలు ఈ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయనిఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల నీటి క‌ష్టాల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవాలని ప్రభుత్వానికి ఆమె సూచించారు. ప్ర‌జ‌ల బ‌తుకుల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెప్ప‌డం ఖాయమని ఆమె హెచ్చరించారు.

*మిల్లర్లతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం: మహేష్‌కుమార్ గౌడ్అ
ధికార పార్టీ నేతలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జీవో 111 ఎత్తివేయడం వల్ల పేద, మధ్య తరగతి రైతులకు ఒరిగిందేమీలేదు, సంపన్నుల కోసమే జీవో 111 ఎత్తి వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మిల్లర్లతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే వడ్ల కొనుగోలు జరపడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాటకంలో రైతులు బలవుతున్నారని మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

*తాను చెప్పింది ఆచరించిన మహామనిషి జ్యోతిబాపూలే: మంత్రి ఎర్రబెల్లి
గొప్ప సామాజిక వేత్తగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహామనిషి జ్యోతిబాపూలే అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘసేవకుడిగా కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు జ్యోతిబాపూలే అన్నారు.తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి అని,సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడని అన్నారు.

*అప్పుడు పాస్‌పోర్ట్ .. ఇప్పుడు బియ్యం దందా: బండి సంజయ్‌
వడ్లు కొనకుంటే కేసీఆర్ గద్దె దిగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వయసు మీద పడి సోయి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లుల నుంచి..డైవర్ట్ చేసేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. కమీషన్లకు టీఆర్ఎస్ నేతలు బాగా రుచి మరిగారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక పాస్‌ పోర్ట్ బ్రోకర్ అని ఆరోపించారు. పత్తి, మిర్చి ధర పెరగడానికి కారణం కేంద్రమేనని స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మందులో సోడా పోసేవాళ్లకు.. సమన్వయ సమితుల బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. ఇసుక, పాస్‌పోర్ట్ దందాలు చేశారని , ఇప్పుడు బియ్యం దందా చేస్తున్నారని బండి సంజయ్‌ దెప్పిపోడిశారు.

*ధాన్యం‌ కొనకుంటే సీఎం కేసీఆర్ గద్దె దిగాలి: ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం‌ కొనాలని, కొనకుంటే గద్దె దిగాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పరిపాలన వదిలేసి దద్దమ్మ మాదిరి ఢిల్లీలో ఎందుకు దర్నా చేస్తున్నారో సీఎం చెప్పాలన్నారు. బంగాఖాతంలో కలుపుతారో.. కలుస్తారో.. ముఖ్యమంత్రితో తేల్చుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్య.. తెలంగాణలో మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో పీకే ప్లాన్స్ పని చేయవన్నారు. ఆత్మగౌరవం మాత్రమే పనిచేస్తుందన్నారు. మంత్రులు, అధికారులు ప్రజలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని, ఐదారు వేల కోట్లతో రైతుల పంటను కొనలేని అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని అర్థమవుతోందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

* ప్రజల సమస్యలపై బుల్డోజర్ నడపాలి : రాహుల్ గాంధీ
ప్రజల సమస్యలను పరిష్కరించాలని, విద్వేషాన్ని వ్యాపింపజేయవద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీకి హితవు పలికారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజల సమస్యలపై బుల్డోజర్‌ను నడపాలన్నారు. బీజేపీ బుల్డోజర్‌లో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సమస్యలపై నుంచి బుల్డోజర్‌ను నడపాలన్నారు. బీజేపీ బుల్డోజర్‌లో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయన్నారు. మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హింసాకాండ చెలరేగింది. శోభాయాత్రపై కొందరు దుండగులు దాడి చేయడంతో విధ్వంసం జరిగింది. దాదాపు ఏడుగురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. ఇళ్లు, వాహనాలను తగులబెట్టారు. ఆది, సోమవారాల్లో ఈ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టాన్ని దుండగుల నుంచే వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనలో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ బుల్డోజర్‌ను ఉపయోగించవలసిన తీరును ప్రభుత్వానికి తెలిపారు.