భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు నమోదు అవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. వాషింగ్టన్లో ఆయన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై భారత భాగస్వామితో రెగ్యులర్గా చర్చిస్తామని, ఇటీవల ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనకర అంశాలను గమనిస్తున్నామని, ప్రభుత్వ, పోలీసు, జైలు అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని, ఆ అంశాలను పరిశీలిస్తున్నట్లు బ్లింకెన్ చెప్పారు. భారత ప్రధాని మోదీ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని అమెరికా ప్రతినిధి ఇలహమ్ ఓమర్ తెలిపారు. మతమార్పిడి చట్టాలను రూపొందిస్తున్న భారతీయ రాష్ట్రాలపై అమెరికా నజర్ పెట్టినట్లు తెలుస్తోంది.