అమెరికాలో పలు చిత్రాల్లో నటించి, బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టిన జో శర్మ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘నర్మద’ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. మోహన్ వడ్లపట్ల సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో శుభాకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
చిత్రనిర్మాత ఎం.ఆర్.సి. చౌదరి ఈ చిత్రకథ గురించి వివరిస్తూ ‘తన ఊరిలో జరుగుతున్న అన్యాయాలను నర్మద అనే యువతి ఎదిరించాలనుకుంటుంది. అయితే అందుకు తన స్థాయి సరిపోదని సినిమా రంగంలోకి వచ్చి పెద్ద హీరోయిన్ అయి, ఆ తర్వాత ఊరి సమస్యను పరిష్కరిస్తుంది. సినిమాలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది’ అని చెప్పారు. మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించిన తర్వాత జో శర్మను ఎంపిక చేశాం. ఈ నెల 20 నుంచి తొలి షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభిస్తాం. రెండో షెడ్యూల్ హైదరాబాద్లో ఉంటుంది’ అని చెప్పారు. ‘నేను అమెరికాలో ఉంటున్నా. తెలుగు అమ్మాయినే. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మోహన్ వడ్లపట్ల గారికి, దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు’ అని చెప్పారు జో శర్మ.