NRI-NRT

బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. బుల్డోజర్ ఎక్కడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో చట్టవిరుద్ధ ఆక్రమణలను బుల్డోజర్లతో తొలగిస్తున్న నేపధ్యంలో అధికార విపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. ఇదే సమయంలో బోరిస్ జాన్సన్ ఇలా బుల్డోజర్ ఎక్కి కనిపించడం ఆసక్తికరం. భారత పర్యటనలో భాగంగా ప్రస్తుతం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఉన్న ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి పంచమహాల్లోని హలోల్ జీఐడీసీ అనే జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు. ఆ సమయంలోనే ఆయన ఆసక్తిగా ఒక బుల్డోజర్పైకి ఎక్కి ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు.

*సబర్మతి సందర్శన అత్యంత గౌరవప్రదం :
బోరిస్ జాన్సన్బోరిస్ జాన్సన్ రెండు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈరోజు ఉదయమే అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఇక్కడ పర్యటన ముగిసిన అనంతరం ఆయన నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించి, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్‌ను కలుసుకోనున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై తిరిగి లండన్ వెళ్లనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ప్రధానమంత్రిగా బోరిస్ ఇంత వరకు భారత్‌కు రాలేదు. అంతే కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం బోరిస్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిటన్‌కు వెళ్లలేదు. ఆయన గతంలోనే భారత్‌కు రావాల్సి ఉంది. గతేడాది జనవరిలో సైతం గణతంత్ర దినోత్సవానికి భారత్‌ ఆహ్వానించగా బ్రిటన్‌లో కరొనా పెరుగుదల కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. ఈసారి భారత్‌‌లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు భారత పర్యటన ఖారారైంది.