NRI-NRT

ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీగా కందుకూరు యువకుడు

ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీగా కందుకూరు యువకుడు

చిన్న వయసులోనే పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా యువకుడు విదేశీ చట్టసభలకు ప్రతినిధిగా ఎంపికయ్యాడు. తన సమాజ సేవతో మెప్పించి ఆస్ట్రేలియాలో యువత కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యాడు. నెల్లూరు జిల్లా తూర్పుకమ్మపాలేనికి చెందిన దివి రామకృష్ణ, ప్రత్యూషలు దంపతులు. రామకృష్ణ 12 ఏళ్ల క్రితమే ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఉంటూ పిల్లలను అక్కడే చదివించుకున్నారు. రామకృష్ణ పెద్ద కుమారుడైన తనూజ్‌చౌదరి (15) అక్కడి కాలేజీలో ప్రస్తుతం ప్లస్‌ వన్‌ (ఇంటర్‌) చదువుతున్నాడు. సమాజ సేవా కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నాడు. అక్కడి చట్టాల ప్రకారం ఇలా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువత చట్టసభల్లో ఎంపికయ్యేందుకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని, ఈ క్రమంలో అన్ని అర్హతలను పరిశీలించిన తరువాత యువత కోటాలో తన కుమారుడిని ఎమ్మెల్సీగా అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసిందని రామకృష్ణ చెప్పారు. ప్రస్తుతం తన కుమారుడు అక్కడి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నాడని తెలిపారు.