NRI-NRT

ఉపరాష్ట్రపతిని డాలస్‌కు ఆహ్వానించిన ప్రసాద్ తోటకూర

ఉపరాష్ట్రపతిని డాలస్‌కు ఆహ్వానించిన ప్రసాద్ తోటకూర

అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ తరఫున ఉపరాష్ట్రపతిని శాలువతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా డాలస్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతేకాకుండా.. వెంకయ్య నాయుడుతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా భవిష్యత్తు తరానికి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేలా సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కూడా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. దీనిపై ఉపరాష్ట్రపతి స్పందించారు. సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఇక ముందు కూడా సేవా భావంతో ముందుకు వెళ్లాలని సూచించారు.