NRI-NRT

చైనాకు భారత్ ఝలక్ చైనీయుల టూరిస్ట్ వీసాల నిలిపివేత!

చైనాకు భారత్ ఝలక్ చైనీయుల టూరిస్ట్ వీసాల నిలిపివేత!

మన విద్యార్థుల భవితవ్యం విషయంలో లైట్‌ తీసుకుంటున్న చైనాకు భారత్‌ ఝలక్‌ ఇచ్చింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్‌ వీసాలను సస్పెండ్‌ చేసింది.ఈ మేరకు భారత్‌ తరఫున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌ (IATA) ఏప్రిల్‌ 20న ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. చైనా పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏయే దేశాలు ప్రయాణానికి అర్హులో అందులో పేర్కొంది. దీంతో పాటు 10 ఏళ్ల కాలవ్యవధి కలిగిన వీసాలు ఏమాత్రం ఇక చెల్లుబాటు కావని ఉత్తర్వుల్లో పేర్కొంది.సుమారు 22 వేల మంది భారత విద్యార్థులు చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా 2020 ప్రారంభంలో వీరంతా స్వదేశానికి వచ్చేశారు. రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే, భౌతిక తరగతులకు హాజరవ్వడానికి విద్యార్థులు అభ్యర్థిస్తున్నప్పటికీ చైనా వారిని అనుమతించడం లేదు. ఇదే విషయమై ఆ దేశాన్ని ప్రభుత్వం పలుమార్లు కోరింది.వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని మార్చి 17న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ బీజింగ్‌ను కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని గతంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నప్పటికీ.. ఆ దిశగా చొరవ కనిపించలేదని చెప్పారు. ఇప్పటికీ భారత విద్యార్థుల విషయంలో ఆ దేశం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో సైతం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయినప్పుడు కూడా దీనిపై చర్చ జరిగినప్పటికీ ఇంతవరకు డ్రాగన్‌ దేశం స్పందించలేదు. దీంతో భారత్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.