Politics

పీకే ను చేర్చుకోవా లా? వద్దా? కాంగ్రెస్లో తర్జనభర్జనలు

పీకే ను చేర్చుకోవా లా? వద్దా? కాంగ్రెస్లో తర్జనభర్జనలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన పార్టీ అగ్రనాయకత్వం, పార్టీ పునరుజ్జీవం అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ అందించిన ప్రజెంటేషన్‌పై అధ్యయనం చేసిన పి. చిదంబరం నేతృత్వంలోని 8 మంది సభ్యుల కమిటీ నివేదికను ఈనెల 21న సోనియా గాంధీకి అందజేయగా, దానిపై సోమవారం చర్చించారు. ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరే అంశం, ఇప్పటికే ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్‌పై భేటీలో సీరియస్గా చర్చించారు. ఈ క్రమంలో పీకే పార్టీలో చేరడం వల్ల కలిగే లాభనష్టాల గురించి అధినేత్రికి సూచనలు చేసినట్టు తెలిసింది.

వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన పార్టీని బయటి నుంచి వచ్చిన వ్యక్తి చేతుల్లో పెట్టడం సరికాదని పలువురు సీనియర్లతో పాటు యువనేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ-ప్యాక్ దేశంలోని పలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తుండడం వల్ల వ్యూహాలు లీకయ్యే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్పినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ కిశోర్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. పార్టీలో చేర్చుకోవడమే ఏకాఏకి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి పదవిని ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే పీకే చేరికపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా, మరో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీకి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ – 2024’ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఏఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

పీకే చేరికపై నేతల మౌనం
సోనియా గాంధీ నివాసంలో సమావేశం అనంతరం మీడియా మాట్లాడిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, పీకే చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా సరే దాటవేత సమాధానాలు ఇచ్చారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడ్రోజుల పాటు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో నిర్వహించే చింతన్ శిబిర్ గురించిన వివరాలు మాత్రమే ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఆహ్వానితులు మొత్తం కలిపి 400 మందికిపైగా చింతన్ శిబిర్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల అజెండాను ఇప్పటికే సిద్ధం చేయగా, ప్రశాంత్ కిశోర్ చేరిక, ఆయన రూపొందించిన వ్యూహాల అమలుపై కూడా చింతన్ శిబిర్‌లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.