NRI-NRT

మే 2 నుంచి మోదీ ఫారిన్ టూర్- 3 దేశాల్లో సుడిగాలి పర్యటన

మే 2 నుంచి మోదీ ఫారిన్ టూర్- 3 దేశాల్లో సుడిగాలి పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2 నుంచి 4 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. యూరప్​లోని జర్మనీ, డెన్మార్క్​, ఫ్రాన్స్ దేశాలను సందర్శించనున్నట్లు విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా మే 2 నుంచి 4 వరకు యూరప్​లోని జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాలను సందర్శించనున్నారు. 2022లో ఇదే ప్రధానికి తొలి విదేశీ పర్యటన అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.

తొలుత బెర్లిన్​లో జర్మనీ ఫెడరల్​ ఛాన్సలర్​ ఒలాఫ్​ స్కోల్జ్​తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు మోదీ. వీరిద్దరూ భారత్​-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల​ ఆరో ఎడిషన్​కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. 2021లో జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరువురు దేశాధినేతలు సమావేశం కానుండడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం జర్మనీలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ.ఆ తర్వాత డెన్మార్క్​ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్​సెన్​ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్​హాగన్​కు వెళతారు. డెన్మార్క్ వేదికగా జరగనున్న ఇండియా- నార్డిక్​ సమ్మిట్​లో ఆయన పాల్గొంటారు. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పులు, ఆవిష్కరణలు, సాంకేతికత, పునరుత్పాదక ఇంధన అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అనంతరం భారత్​- డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొననున్న మోదీ.. ప్రవాస భారతీయలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఐస్‌లాండ్ ప్రధాన మంత్రి కాట్రిన్ జాకోబ్స్‌డోట్టిర్, నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్, స్వీడన్ ప్రధాని మాగ్డలీనా ఆండర్సన్, ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్​తోనూ మోదీ సమావేశం కానున్నారు. మే 4న తిరుగు ప్రయాణంలో.. ప్రధాని కొద్దిసేపు పారిస్‌లో ఆగి నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను కలవనున్నారు.