మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత బీజేపీలో చేరే విషయమై షరతులు విధించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా అప్పటి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన సుమలతకు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం ఆమెను బీజేపీలోకి చేర్చుకోవాలనే ప్రతిపాదనలు సాగుతున్నాయి. ఇందుకు సుమలత కూడా సానుకూలంగా ఉన్నా ముందుగానే కొన్ని సర్దుబాట్లపై అగ్రనేతల నుంచి హామీ తీసుకోవాలని భావిస్తున్నారు. బీజేపీలో చేరితే కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇవ్వాలని, మండ్య జిల్లా టికెట్ల పంపిణీలో స్వేచ్ఛ ఉండాలని, మద్దూరులో కుమారుడు అభిషేక్కు టికెట్ ఇవ్వాలనే షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. జిల్లా నుంచి కనీసం 4 స్థానాలు గెలుపొందాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ, సుమలతను పార్టీలో చేర్చుకోవడం ఇదే సరైన సమయమని భావిస్తోంది.