రోడ్డు పక్కన టీ దుకాణం వద్ద కూర్చుని ఉబుసుపోని మాటలు చెప్పుకునే వాళ్లు.. ఏకంగా దేశ ప్రధాని వైఫల్యాల గురించి కూడా చాలా సునాయాసంగా కామెంట్ పాస్ చేయగలరు! అలాంటి నేలబారు స్థాయిలో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ, బాధ్యత గల, అధికారం గల ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చిన్న మాట మాట్లాడినా అది చాలా చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం గగ్గోలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. పేపర్ల లీకేజీ ఒక దారుణం అయితే.. అది కష్టపడి చదువుకునే విద్యార్థుల స్థైర్యాన్ని ఎంత నాశనం చేస్తుందనేది మరో కీలకమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం చేతగానితనం అచ్చంగా బయటపడిపోతున్నది. లీకేజీలను అడ్డుకోలేకపోయారన్న అపకీర్తి తప్పలేదు.
అయితే సీఎం మాత్రం రెండు నారాయణ, మూడు శ్రీచైతన్య కాలేజీల్లోనే లీకేజీలు జరిగాయని, అనగా తెలుగుదేశం వారే లీకేజీలు చేయించి.. ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి మాటలు రచ్చబండ ఎవరైనా మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ సీఎం మాట్లాడాల్సినవి కాదు. ఆయనమాటే నిజమైతే తక్షణం ఆయా పాఠశాలల లైసెన్సులను రద్దు చేసేసి, బాధ్యులను అరెస్టు చేసి ఎందుకు తక్షణ చర్యలు తీసుకోలేదు. ఎందుకు ఉపేక్షిస్తున్నారు. అనేది పెద్ద ప్రశ్న. బహిరంగ సభలో రాజకీయ విమర్శలు చేయడంతో సరిపెట్టకుండా ఎందుకు అధికారికంగా చర్యలకు ఉపక్రమించడం లేదు?ఫలానా వాళ్లు లీకేజీలు చేస్తున్నారని తెలిసినా ఏమీ చేయకుండా ఉన్నారంటే ఈ ప్రభుత్వం గురించి ఏమనుకోవాలి? వాళ్లతో లాలూచీ పడడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదనే భావం ప్రజలకు ఏర్పడదా? అందువల్ల.. ముఖ్యమంత్రి స్థాయిలో ఆరోపణలు చేసేప్పుడు.. ససాక్ష్యంగా వారి మీద చర్యలు తీసుకున్న తర్వాతే ఆ పనిచేస్తే ప్రభుత్వానికి ఎంతో గౌరవం పెరుగుతుంది. – దాసరి కృష్ణ మోహన్ సీనియర్ జర్నలిస్ట్