Movies

సరోజినీ నాయుడు బయోపిక్‌లో…

సరోజినీ నాయుడు బయోపిక్‌లో…

సినీ ప్రియులకు నిన్నటితరం నాయిక శాంతి ప్రియ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్‌ భాను ప్రియ సోదరిగా పరిశ్రమను ఆకర్షించిన శాంతి ప్రియ.. ‘మహర్షి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం అనంతరం నటనకు దూరమై.. పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది. మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి తెరపైకి వస్తున్నదీ నటి. స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. శాంతి ప్రియ మాట్లాడుతూ…‘పెళ్లయ్యాక భార్యగా, తల్లిగా నాపై ఉన్న బాధ్యతలు నెరవేర్చాలనుకున్నా. అందుకే సినీ రంగానికి దూరమయ్యా. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. నేను మళ్లీ నటించేందుకు వాళ్ల ప్రోత్సాహమే కారణం. ఇవాళ చిత్ర పరిశ్రమల్లో పెళ్లయిన తారలే కాదు పిల్లలున్న వారు కూడా నటిస్తున్నారు. తమకిష్టమైన రంగంలో కొనసాగుతున్నారు. నటిగా తిరిగి వెండితెరకు రావడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం సరోజినీ నాయుడు జీవిత కథా చిత్రంలో నటిస్తున్నాను. ఇది పాన్‌ ఇండియా సినిమా. సరోజినీ నాయుడు ఆహార్యం, హావభావాలు సరిగ్గా పలికేలా సాధన చేస్తున్నాను. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తున్నది’ అని చెప్పింది.