DailyDose

ఏసీ, ఫ్రిజ్​, ఇంటర్​నెట్​.. తెగ వాడేస్తున్న భారతీయులు!

ఏసీ, ఫ్రిజ్​, ఇంటర్​నెట్​.. తెగ వాడేస్తున్న భారతీయులు!

భారతదేశంలో విలాసవంతమైన వస్తువుల వినియోగం గత అయిదేళ్లలో బాగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం ఎక్కువగా పెరగకపోయినా ఇంటర్నెట్​ మాత్రం భారీ పెరిగింది. ఏసీ, ఫ్రిజ్​, వాషింగ్​ మిషన్ల వాడకంలో పెరుగదల కనిపించింది. ప్రస్తుతం ప్రతి ఒకరి చేతిలో మొబైల్‌ ఉండటం వల్ల గడియారం వాడకం బాగా తగ్గింది.

గత అయిదేళ్లలో దేశ సౌకర్యాల ముఖచిత్రం మారిపోయింది. విలాసవంత వస్తువుల వినియోగం పెరిగి పోగా.. ఇదే సమయంలో దారిద్య్రరేఖకు దిగువన ఉండే కార్డుల సంఖ్యలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలను 2015-16 నాటి ఆరోగ్యసర్వే- 4తో పోల్చి చూస్తే దేశంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అయిదేళ్లలో ఫోన్లు, కంప్యూటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులేకపోయినా ఇంటర్నెట్‌ వినియోగం మాత్రం భారీగా పెరిగింది. అలాగే ఏసీ/కూలర్లు, ప్రెజర్‌కుక్కర్ల వాడకంతో పాటు ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్ల వినియోగంలోనూ పెరుగుదల కనిపించింది.

పట్టణ ప్రాంతాల్లో కలర్‌ టీవీ వాడకం గత అయిదేళ్లలో 86% దగ్గరే నిలిచిపోగా.. అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 51.5% నుంచి 57.1%కి పెరిగిపోయింది. కాల క్రమంలో రేడియో, బ్లాక్‌ అండ్‌వైట్‌ టీవీ, ల్యాండ్‌లైన్లు, సైకిల్‌, ఎద్దుల బండ్ల వినియోగం తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్‌ ఉండటం వల్ల గడియారం వాడకం కూడా తగ్గిపోయింది. కంప్యూటర్‌ వాడకం కూడా అయిదేళ్లలో కేవలం 0.3% పెరిగింది. ఇళ్లలో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సౌకర్య, విలాసవంతమైన వస్తువులు లేని వారి నిష్పత్తి అయిదేళ్ల క్రితం 0.8% మేర ఉండగా ఇప్పుడు అది సగానికి సగం పడిపోయి 0.4%కి తగ్గిపోయింది. గత అయిదేళ్లలో ద్విచక్ర మోటారు వాహన వినియోగం 37.7 నుంచి 49.7%కి పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలుఇదే సమయంలో కార్లు వినియోగించే వారి నిష్పత్తి 1.5% మాత్రమే పెరిగింది. గత అయిదేళ్లలో ఎలాంటి వాహన సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య 5.3%మేర తగ్గింది. బ్యాంకు అకౌంట్లు ఉన్న కుటుంబాలు, ఆరోగ్య బీమా కవరేజీ ఉన్నవారి సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఈ గణాంకాల శైలిని బట్టి చూస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరిగినట్లు కనిపించింది. దేశంలో బీపీఎల్‌ కార్డులున్న కుటుంబాల సంఖ్య 2015-16లో 38.6% మేర ఉండగా, 2019-21నాటికి అది 45.1%కి చేరింది. దీన్ని బట్టి దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.