DailyDose

నేపాల్ , పాకిస్థాన్ లో కార్ల రేట్లకు.. భారత్ కార్ల ధరలకు మరీ ఇంత తేడానా..?

నేపాల్ , పాకిస్థాన్ లో కార్ల  రేట్లకు.. భారత్ కార్ల ధరలకు  మరీ ఇంత తేడానా..?

కరోనా తర్వాత స్వంత వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. భారత్‌లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా కార్ల అమ్మకాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నా చాలా మంది కార్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే నేపాల్, పాకిస్థాన్ వంటి దేశాల్లో కార్ల రేట్లు తారస్థాయిలో ఉన్నాయి. భారత్‌తో పోల్చుకుంటే నేపాల్‌లో కార్ల ధరలు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో కార్ల ధరలు భారత్‌తో పోల్చుకుంటే రెట్టింపు ఉన్నాయి.

భారత్‌లో టాటా సఫారీ బేస్ వేరియెంట్ ధర రూ.15.25 లక్షలు (ఎక్స్- షోరూం). ఇదే కారును నేపాల్‌లో కొనాలంటే 63.56 రూపాయలు (83.49 లక్షల నేపాలీ రూపాయలు) చెల్లించాలి. ఇక, కియా సొనెట్ ధర భారత్‌లో రూ.7.15 లక్షల రూపాయల (ఎక్స్- షోరూం) నుంచి మొదలవుతుంది. అదే నేపాల్‌లో అయితే రూ.23.10 లక్షల (36.90 లక్షల నేపాలీ రూపాయలు) నుంచి ప్రారంభమవుతుంది. దిగుమతి చేసుకుంటున్న కార్లపై నేపాల్ ప్రభుత్వం ఏకంగా 298 శాతం వరకు పన్ను విధిస్తుండడమే అక్కడ భారీ రేట్లకు కారణం.

పాకిస్థాన్ విషయానికి వస్తే అక్కడ కార్ల ధరలు భారత్‌తో పోల్చుకుంటే డబుల్ ఉన్నాయి. పాకిస్థాన్‌లో కూడా సుజికీ సంస్థ ఆల్టో, వేగన్ ఆర్, స్విఫ్ట్ వంటి కార్లను విక్రయిస్తోంది. భారత్‌లో సుజికీ ఆల్టో కారు బేస్ వేరియెంట్ ధర రూ. 3.39 లక్షలు. అదే పాకిస్థాన్‌లో ఈ కారును కొనాలంటే రూ.6 లక్షలు (14.75 పాకిస్థానీ రూపాయలు) చెల్లించాలి. అలాగే మన దేశంలో వేగన్ ఆర్, స్విఫ్ట్ ప్రారంభ మోడళ్ల ధరలు వరుసగా రూ.5.47 లక్షలు (ఎక్స్- షోరూం), రూ.5.97 (ఎక్స్- షోరూం) లక్షలుగా ఉన్నాయి. అదే, పాకిస్థాన్‌లో వేగన్ ఆర్, స్విఫ్ట్ ప్రారంభ మోడళ్ల ధరలు వరుసగా రూ.8.47 లక్షలు (20.84పాకిస్థానీ రూపాయలు), రూ.11.28 లక్షలు (27.74పాకిస్థానీ రూపాయలు)గా ఉన్నాయి.