సింగపూర్లో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి ఉత్సవాలను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. దాతలు అందించిన స్వచ్ఛంద విరాళాలతో వెంకటరమణ, సంకా వెంకట రవికుమార్, ఉద్దగిరి సతీశ్ ఆధ్వర్యంలో మరుగన్ జ్ఞాన మునీశ్వర్ ఆలయంలో సామూహిక అర్చన, వాసవి పారాయణం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను కనుల పండువలా నిర్వహించారు.కొవిడ్ మహమ్మారి తర్వాత వేడుకలు నిర్వహిస్తుండడం భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. వామ్ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూపారాణి ఆన్లైన్ ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వామ్ సింగపూర్ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త మాట్లాడుతూ ఆద్యంతం అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సమస్త మానవాళికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంచర్ల శరత్ బాబు, కోట సతీశ్, కంకిపాటి శశిధర్, పత్తూరి కిరణ్ పాల్గొన్నారు