Politics

చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు

చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు

చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇక ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమై ప్రేమ చూపించాడు. నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని సీఎం మండిపడ్డారు. ఏలూరు జిల్లా గణపవరంలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, రాజకీయాల గురించి ఆలోచన చేయనని.. ప్రజలకు మంచి చేయాలన్నది తన తపన’’ అని సీఎం అన్నారు.‘‘ఈ మధ్య రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయల్దేరాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందని ఒక్కరిని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడు. ఇవాళ వీరంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. మన ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. తనకు చంద్రబాబుకు ఉన్న తేడా అదే’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

వ్యవసాయం దండగ అన్ననాయకుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?. రైతుల ఉచిత విద్యుత్‌, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు, రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను ఒకసారి గుర్తుచేసుకోండి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్‌ కోరారు.‘చంద్రబాబు 2014లో పెట్టిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి కూడా తీసేశారు. చెత్తబుట్టలో వేసిన చంద్రబాబుగారి నైజాన్ని చూడండి. ఇవాళ మన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఇంటికీ జగనన్న రాసిన లేఖను అందించి.. ఏం మేలు జరిగిందో చూపిస్తూ, గుర్తుచేస్తూ, మేనిఫెస్టోలో ఏం జరిగిందో టిక్కు పెట్టిస్తున్నారు. మన అందరి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించండని సీఎం జగన్‌ ప్రజల్ని కోరారు.

జగన్‌ మీ బిడ్డ. రైతుల తరఫున నిలబడే బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా? ఎన్నికలు అయిన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదు జగన్. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో… అదే చేస్తాడు. దేవుడు ఆశీస్సులు కావాలి.. మీరు చల్లని దీవెనలు ఇవ్వాలని’ సీఎం జగన్‌ అన్నారు.