NRI-NRT

నేపాల్‌ మార్గంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్విత

నేపాల్‌ మార్గంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్విత

తెలంగాణ కీర్తి పతాక ఎవరెస్ట్‌ శిఖరాగ్రాన్ని చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు 24 ఏళ్ల పడమటి అన్విత ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. 29,112 అడుగుల (8,848.86 మీటర్లు) ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాగ్రానికి చేరుకున్న అన్విత.. నేపాల్‌ మార్గంలో శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ తొలి మహిళగా, ఎవరెస్ట్‌ ఎక్కిన తెలంగాణ రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. అక్కడ జాతీయ జెండాతో పాటు భువనగిరి ఖిల్లా, ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌, స్పాన్సర్స్‌ ఫ్లెక్సీలను సగర్వంగా ప్రదర్శించి వెనుదిరిగారు. మంగళవారం సాయంత్రానికి ఆమె బేస్‌ క్యాంప్‌కు చేరుకోనున్నారు. కాగా, 2014లో అప్పటి సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పూర్ణ.. చైనా మార్గంలో ఎవరె్‌స్టను అధిరోహించిన తెలంగాణ తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఆ తర్వాత ఇప్పుడు అన్విత ఈ రికార్డు సాధించారు. ఏప్రిల్‌ 17న ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న అన్విత అక్కడి శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొంది ఈ నెల 9వ తేదీన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. 16న లక్ష్యాన్ని చేరుకున్నారు. భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ పొందిన అన్విత గత ఏడాది డిసెంబరు 7న మైనస్‌ 40 డిగ్రీల చలిలో 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రూస్‌ పర్వతాన్ని అధిరోహించారు.