NRI-NRT

లండన్‌లో ‘వేదాంత’ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

లండన్‌లో ‘వేదాంత’ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ‌లో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా యూకేలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలు అధినేత‌లు, ఎన్నారైల‌తో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న‌ లండన్‌లో వేదాంత లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో సమావేశమయ్యారు.తెలంగాణలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. హైదరాబాద్‌ కు రావాల్సిందిగా అనిల్ అగ‌ర్వాల్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు.
ktr-1-2
*దేశానికే తెలంగాణ రోల్‌మోడ‌ల్‌: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడ‌ల్‌గా మారింద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యూకేలో పర్యట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న‌ లండన్‌లోని హై కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన సమావేశంలో భారత్, బ్రిటన్‌కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జొయ్ ఘోష్ , నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ అనేక అంశాల పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

*భారతదేశం ప్రపంచంతో పోటీపడి ముందుకు పోవాలంటే అద్భుతమైన, విప్లవాత్మకమైన పాలనా సంస్కరణలు అవసర‌మ‌ని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రపంచంలోని చాలాదేశాల జ‌నాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే, భారతదేశ జనాభాలో ఉన్న అత్యధిక యువ బలం ఆధారంగా అగ్రశ్రేణి దేశంగా మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడి స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
KTR3
*పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణీయ గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌
తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న సంక్షోభిత పరిస్థితులను దాటుకొని ఈ రోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు ఆకర్షించే ఒక అద్భుతమైన పెట్టుబడుల ఆకర్షణీయ గమ్యస్థానంగా మారడానికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టంచేశారు. కేవలం పెట్టుబడులే కాకుండా ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన తీరును వివ‌రించారు. దీంతో స‌మావేశానికి హాజరైన వారు చప్పట్లతో అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కావని, అవి భారతదేశ విజయాలుగా పరిగణించి, ప్రపంచానికి చాటాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా వివిధ దేశాల్లో ఉన్న భారత ఎన్నారైలు దేశ‌ విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థికాభివృద్ధిలాంటి అనేక అంశాలపై సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానంగా తన అభిప్రాయాలను కేటీఆర్ పంచుకున్నారు.