NRI-NRT

ఎడారి భూముల్లో పచ్చదనం.. గల్ఫ్‌ దేశాల కృషి ప్రశంసనీయం!

ఎడారి భూముల్లో పచ్చదనం.. గల్ఫ్‌ దేశాల కృషి ప్రశంసనీయం!

*దుబాయ్‌లో ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌

ఎడారి భూములను సారవంతంగా మార్చడానికి గల్ఫ్‌ దేశాలు చేస్తున్న కృషిని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాకుడు సద్గురు జగ్గీవాసుదేవ్‌ ప్రశంసించారు. ‘ఇసుకకు సేంద్రియ సారాన్ని జోడిస్తే మట్టిగా మారుతుంది. ఆ సారాన్ని పూర్తిగా తీసేస్తే బీడుగా, ఎడారిగా మారుతుంది. గల్ఫ్‌ దేశాలు ఇసుకకు సేంద్రియ సారాన్ని చేర్చడం ద్వారా ఎడారి భూములను సారవంతం చేస్తున్నాయి’ అని ఆయన వివరించారు. అయితే భారత్‌ సహా మిగిలిన ప్రపంచ దేశాలన్నీ సారవంతమైన భూములను ఎడారిగా మారుస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భూసార పరిరక్షణపై ప్రజలను చైతన్యం చేసేందుకు 27 దేశాల మీదుగా వంద రోజుల్లో 30 వేల కిలోమీటర్ల మేర ఆయన ఒంటరిగా మోటార్‌సైకిల్‌పై యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా గల్ఫ్‌ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఐరోపా, టర్కీ మీదుగా సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లో యాత్ర ముగించుకుని యూఏఈ చేరుకున్నారు. భూసార పరిరక్షణకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని తన ప్రసంగంలో సద్గురు కోరారు. మట్టిలో కనీసం 3 శాతం ఆర్గానిక్‌ సారం ఉండాలని.. కానీ అమెరికా, ఐరోపా దేశాలు సహా ఏ ఒక్క దేశంలోనూ ఆ మోతాదు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.