NRI-NRT

‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’

‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’

టోక్యో వేదికగా మరో రెండు రోజుల్లో జరగనున్న క్వాడ్​ సదస్సు.. పలు కీలక అంశాలపై చర్చించేందుకు నాలుగు దేశాల నాయకులకు గొప్ప అవకాశంగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సు, జపాన్​- భారత్​ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ఇండో ఫసిపిక్​ ప్రాంతంలో చైనా కదలికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

జపాన్​లో ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం, ఇండో- ఫసిఫిక్​ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలు పంచుకునేందుకు ఈ సమావేశం గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. మే 23-24 మధ్య రెండు రోజుల పాటు జపాన్​లో పర్యటించనున్నారు భారత ప్రధాని.

” ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నాను. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ అభివృద్ధి, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించనున్నాం. జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నాను. టోక్యో పర్యటన సందర్భంగా.. భారత్​- జపాన్​ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు చేపడతాం. ఆ తర్వాత జపాన్​లో జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటాను. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పనుల పురోగతిని సమీక్షించేందుకు నాలుగు దేశాల నేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం. అలాగే.. ఇండో-ఫసిపిక్​ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై మా ఆలోచనలను పంచుకోనున్నాం.”- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

తొలిసారి క్వాడ్​ సదస్సుకు ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోని అల్బనీస్​ హాజరవుతారని చెప్పారు మోదీ. ఆయనతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర ప్రయోజనాల కోసం అంతర్జాతీయ అంశాలపైనా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. భారత్​, జపాన్​ల మధ్య ఆర్థిక సహకారం కోసం ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్​ భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. గత మార్చిలో జరిగిన సదస్సులో పీఎం కిషిదాతో జరిగిన ఒప్పందాలను గుర్తు చేసుకున్నారు మోదీ. భారత్​లో 5 ట్రిలియన్​ జపాన్​ యెన్​ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. సుమారు 40వేల మంది ప్రవాస భారతీయులు జపాన్​లో ఉన్నారని, వారే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు వారిధిగా పేర్కొన్నారు.

ఇండో ఫసిపిక్​లో చైనాపై:
భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటైన క్వాడ్‌ కూటమి మే 24న జపాన్‌లోని టోక్యో సమావేసం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా క్వాడ్‌దేశాలు చైనాపై దృష్టి సారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇండో- పసిఫిక్‌ సముద్రంలో.. చైనా చేస్తున్న అక్రమ చేపల వేటను సమీక్షించాలని క్వాడ్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఇండో-పసిఫిక్‌ సముద్రంలో జరిగే అక్రమ చేపల వేటల్లో 95 శాతం చైనా దేశస్థులవేనని అంచనా. ఈ నేపథ్యంలో అక్కడ ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని క్వాడ్‌కూటమి భావిస్తోంది. ఇది ఆచరణ రూపం దాలిస్తే ఇండో-పసిఫిక్‌తీరంలో చైనా కార్యక్రమాలపై డేగ కన్ను వేసేందుకు వీలవుతుంది.హిందూ-పసిఫిక్‌ సముద్ర తీర దేశాల్లో స్వేచ్ఛాయుత భాగస్వామ్యాలే లక్ష్యంగా.. చతుర్భుజ భద్రతా కూటమి-క్వాడ్ ఏర్పాటైంది. అలాగే ఇండో- పసిఫిక్‌తీరంలో చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్‌పెట్టేలా క్వాడ్‌ భాగస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరగబోయే సమావేశంలోనూ చైనాను కట్టడి చేసేందుకు ఎలాంటి ఉమ్మడి కార్యాచరణను క్వాడ్‌కూటమి ప్రకటిస్తుందో అన్న ఆసక్తి ప్రపంచ దేశాల్లో నెలకొంది.