NRI-NRT

క్వాడ్​ దేశాధినేతల భేటీ.. ఇండో పసిఫిక్​ పరిస్థితులపై చర్చ

క్వాడ్​ దేశాధినేతల భేటీ.. ఇండో పసిఫిక్​ పరిస్థితులపై చర్చ

జపాన్ రాజధాని టోక్యో వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు.ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, అంతర్జాతీయ అంశాలపై నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

జపాన్ రాజధాని టోక్యో వేదికగా క్వాడ్ దేశాధినేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిదా, ఆంథోనీ అల్బనేస్ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, అంతర్జాతీయ అంశాలపై నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా.. తక్కువ సమయంలోనే క్వాడ్ కూటమి ప్రపంచంలోనే ముఖ్యమైన స్థానాన్ని పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం క్వాడ్ పరిధి విస్తృతమైందని, మరింత ప్రభావవంతంగా మారిందని అభిప్రాయపడ్డారు.

” క్వాడ్ దేశాల మధ్య పరస్పర నమ్మకం, అంకితభావం, ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తాయి. కొవిడ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల సరఫరా, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆర్థిక సహకారం సహా పలు అంశాలలో సమన్వయాన్ని కొనసాగించాం. తద్వారా ఇండోపసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం తెచ్చేందుకు కృషిచేశాం.”- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.

*పుతిన్​పై బైడెన్​ విమర్శలు:
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒక సంస్కృతిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు.ప్రస్తుత వివాదం ఐరోపా అంశం మాత్రమే కాదని.. అంతర్జాతీయ అంశమని అభిప్రాయపడ్డారు.. ఉక్రెయిన్ ఆహారధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా యుద్ధాన్ని కొనసాగించినంత కాలం.. అమెరికా తమ భాగస్వామ్య పక్షాల తరుఫున పనిచేస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు.. క్వాడ్ దేశాలతో కలిసి పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని తెలిపారు. వాతావరణ మార్పులపై చర్యలు సహా, ఆర్థిక, సైబర్, ఇంధన, ఆరోగ్య, పర్యావరణ భద్రత ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని మరింత శక్తివంతంగా మార్చడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.