వరుస పరాజయాలతో కుదేలవుతోన్న కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతోన్న వేళ.. ఆ పార్టీకి తాజాగా భారీ షాక్ తగిలింది.సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ను వీడినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాజ్వాజ్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇదిలాఉంటే, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులపై పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ రెబల్గా మారిన జీ-23 బృందంలోనూ కపిల్ సిబల్ ఉన్నారు. పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉండడాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన.. అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీనే తీసుకుంటారని పలుసార్లు విమర్శించారు. ఇలా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కపిల్ సిబల్ చివరకు పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.