NRI-NRT

వాషింగ్టన్ డి.సి లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

వాషింగ్టన్ డి.సి లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శుక్రవారం భాను మాగులూరి అధ్యక్షతన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కేక్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెలుగుజాతి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని అన్నారు. నందమూరి తారక రామారావు జయంతి వేళ సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ, ఆయన స్మరణం సదా సంతోషదాయకమన్నారు.
IMG-20220527-WA0256
ప్రజా జీవితంలో, రాష్ట్ర రాజకీయాలలో ప్రమాణాలు, విలువల గురించి చెప్పుకున్నప్పుడల్లా ప్రథమంగా గుర్తుకొచ్చేది ఆ మహోన్నత వ్యక్తే. భారత రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల వ్యవస్థకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన చారిత్రక మూర్తిగా, తెలుగుదనపు తియ్యదనాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా చవి చూపించిన తెలుగు వల్లభుడు ఎన్టీఆర్ అని అన్నారు. నూతక్కి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేసి వాటిలో కీలక పాత్ర పోషించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. రాజకీయాలు వృత్తి, వ్యాపారాలుగా మారిన నేపథ్యంలో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవకు పాతరేసిన తరుణంలో ఎన్టీఆర్ నీతి, నిజాయతీ, పట్టుదల, సాహసం ప్రతి ఒక్క తెలుగువాడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 
IMG-20220527-WA0257
గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. రాజకీయాలలో ఉన్నది పుష్కర కాలమే అయినా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఖ్యాతిని, చరిష్మాను ప్రపంచ దేశాలు కొనియాడాయి. జాతి నిర్మాణం వైపు ప్రజలను జాగృతం చేసి తన ఆలోచనలు, ఆవేశంతో నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, గోరంట్ల పున్నయ్య చౌదరి, సామినేని కోటేశ్వరరావు, ఉయ్యూరు శ్రీనివాసరావు, రామ్ చౌదరి ఉప్పులూరి, చంద్ర మల్లావతు, రమాకాంత్ కోమ, రమేష్ అవిరినేని, అనిత మన్నవ తదితరులు పాల్గొన్నారు.
IMG-20220527-WA0258