టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చేశారు. ఇండియాలో ఆ కంపెనీ ప్లాంట్ను ఓపెన్ చేస్తుందా లేదా అన్న అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండియాలో టెస్లా కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మస్క్ ట్విట్టర్లో బదులిచ్చారు. తొలుత తమ కార్లను అమ్మడానికి అనుమతి ఇవ్వకున్నా, తమ కార్లకు సర్వీస్ చేసే అవకాశం ఇవ్వకున్నా, అలాంటి దేశాల్లో తాము ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోమని మస్క్ స్పష్టం చేశారు.ఎలక్ట్రానిక్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మస్క్ కామెంట్ కొంత నిరాశనే మిగిల్చింది. వాస్తవానికి టెస్లా కార్లపై అధిక స్థాయిలో దిగుమతి సుంకం చెల్లించాల్సి వస్తుంది. అయితే టెస్లా కంపెనీ తమ కార్ల తయారీ కేంద్రాన్ని ఇండియాలో స్థాపించుకునేందుకు తాము అవకాశం ఇస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కానీ చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మనివ్వమని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మస్క్ ఇచ్చిన వివరణతో టెస్లా, భారత్ మధ్య అగాధం పెరిగింది.