Politics

ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని నేను చేయలేదు

ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని నేను చేయలేదు

మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పనేదీ తాను చేయలేదని పేర్కొన్నారు.
గత ఎనిమిదేళ్ల ఎన్​డీఏ పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని ఏదీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ రాజ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని శనివారం ప్రారంభించిన ప్రధాని… అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. గత ఎనిమిదేళ్ల భాజపా పాలనలో పేదల సంక్షేమం సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు ప్రధాని. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్ కా ప్రయాశ్‌ నినాదాల ద్వారా దేశాభివృద్ధికి ఊతమిచ్చినట్లు చెప్పారు. వివిధ పథకాల ద్వారా దేశంలోని పేదల ‌అభ్యున్నతికీ పనిచేస్తున్నామన్నారు. తద్వారా వారి జీవితాలను మెరుగు పరిచేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో పేద ప్రజల కోసం ఆహార ధాన్యాల నిల్వలను తెరిచినట్లు మోదీ చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు అందజేసినట్లు గుర్తుచేశారు. అంతకుముందు నూతన ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని.. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.