Politics

ఏపీ రాజకీయాల్లో ‘పొత్తు’ లాట.. తగ్గే దెవరు? నెగ్గే దెవరు?

ఏపీ రాజకీయాల్లో ‘పొత్తు’ లాట.. తగ్గే దెవరు? నెగ్గే దెవరు?

ఏపీ రాజకీయాల్లో ‘పొత్తు’లాట మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు కీలకం కానుండటంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టాయి.రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమంటూ గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. నిన్న మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పొత్తుల అంశాన్ని ప్రస్తావించి రాష్ట్రంలో రాజకీయ చర్చకు తెరలేపారు. ఈనేపథ్యంలో పొత్తుల వల్ల ఏపార్టీకి లాభం, ఎవరి నష్టం అనే దానిపై రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు.

*2014లో పరిస్థితి పునరావృతమవుతుందా?
2014 ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి సునాయాసంగా అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అప్పట్లో జనసేన తన అభ్యర్థులను బరిలో దించకుండా తెదేపా, భాజపాకు మద్దతిచ్చింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నాయి. జనసేన పార్టీ బీఎస్పీ, వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీచేసినా సీట్లు సాధించలేకపోయింది. ఫలితంగా వైకాపా 151 స్థానాలతో భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. తెదేపా 23 స్థానాలకే పరిమితం కాగా, జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో రెండు చోట్ల ఓడి పోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయినా, పట్టువదలకుండా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే అధికారంలోకి వచ్చింది. దీంతో ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో ఈ 3 పార్టీలకు జ్ఞానోదయమైంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

*మహానాడుతో జోష్‌ మీదున్న తెలుగు తమ్ముళ్లు
మెజార్టీ నియోజకవర్గాల్లో జనసేనకు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఓటర్లు ఉన్నారు. దీంతో జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదనే భావనలో తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. గతంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ శ్రేణులను విజ్ఞప్తులు కూడా అందాయి. అప్పట్లో దీనిపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. వన్‌సైడ్‌ లవ్‌ ఉంటే సరిపోదని చమత్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పలు చోట్ల లోపాయికారిగా జనసేన, తెదేపా కలిసి పోటీ చేశాయి. చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ ఆగడాలను రెండు పార్టీలు కలిసి ఎదుర్కొంటున్న సందర్భాలు లేకపోలేదు. విడివిడిగా కంటే కలివిడిగా ఉంటేనే వైకాపాను దీటుగా ఎదుర్కోగలమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇటీవల ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాయి. అప్పటి నుంచి తెదేపా శ్రేణులు మంచి జోష్‌ మీద ఉన్నాయి. అయితే, ఈ నేపథ్యంలో నిన్న పవన్‌ కల్యాణ్ చేసిన 3 ప్రతిపాదనలపై తెదేపా అధినాయత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. 2014లో, 2019 ఎన్నికల్లో తాము తగ్గామని ఈసారి తెలుగుదేశం పార్టీ తగ్గితే బాగుంటుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటూ తెలుగుదేశం నేతలకు బైబిల్‌ సూక్తిని వినిపించారు. పవన్‌ విజ్ఞప్తి మేరకు తెలుగుదేశం నేతలు ఏమేరకు తగ్గుతారో వేచి చూడాలి.

*జనసేన మాతోనే అంటోన్న భాజపా
పొత్తుల అంశంపై పవన్‌ ప్రకటన చేసిన వెంటనే భాజపా నాయకత్వం స్పందించింది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. పవన్‌ను సీఎం అభ్యర్థిగా చూడాలని భాజపా అధినాయకత్వం కోరుకుంటోందని గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. కానీ, పవన్‌ కల్యాణ్ నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… జనసేన, భాజపా సీఎం అభ్యర్థి తానేనని భాజపా అధినాయకత్వం తనతో ఎప్పుడూ చెప్పలేదని పవన్‌ కల్యాణ్ వెల్లడించారు. భాజపాతో కొంత సోషల్‌ డిస్టెన్స్‌ ఉన్నప్పటికీ కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఏపీలో రెండు రోజుల పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్న సందర్భంలో పవన్‌ కల్యాణ్ పొత్తుల అంశాన్ని లేవనెత్తడంతో దీనిపై జేపీ నడ్డా కూడా క్లారిటీ ఇస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు తెదేపాతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన సుముఖంగా ఉంటే, భాజపా పరిస్థితి ఏంటనే వాదన కూడా ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా తెదేపా నేతలు భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. అవన్నీ మనసులో పెట్టుకుని భాజపా నేతలు తెదేపాతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకొస్తారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. భాజపా నేతల్లో కొందరికి జగన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల తెదేపాతో భాజపా పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదని ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్ చెప్పినట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే తెదేపా, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తేనే మేలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భేషజాలకు పోయి ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తే మాత్రం లక్ష్యాన్ని అందుకోలేరని అంటున్నారు. మొత్తం మీద పొత్తులాటలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేదానిపై స్పష్టత రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.