కరోనా వైరస్ మరోసారి హిందీ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నది. ఇటీవల రోజుల వ్యవధిలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్ వంటి సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా షారుఖ్ ఖాన్కు కూడా కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయినట్లు సమాచారం. దీంతో వాళ్లు నటిస్తున్న సినిమాల షూటింగ్స్కు అంతరాయం ఏర్పడుతున్నది. షూటింగ్స్ లేని తారలు అవార్డుల ఫంక్షన్లు, పబ్లిసిటీ ఈవెంట్స్ వంటి ఇతర కార్యక్రమాలకు దూరమై క్వారెంటైన్లో ఉంటున్నారు. కరోనా రావడం వల్ల కత్రీనా కైఫ్ ‘మెరీ క్రిస్మస్’ సినిమా షూటింగ్కు దూరమైంది. తాజాగా కరణ్ జోహార్ తన 50వ పుట్టిన రోజు సందర్భంగా వెస్ట్ ముంబై అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా పాల్గొన్నారు. ఈ పార్టీ వైరస్కు సూపర్ స్ప్రెడర్ అయ్యిందని అంటున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న కనీసం 50 నుంచి 55 మంది తారలకు వైరస్ సోకి ఉంటుందని సమాచారం. అయితే కొంతమంది నటీనటులు తమకు కోవిడ్ వచ్చినా బయటకు చెప్పడం లేదని తెలుస్తున్నది.