Politics

ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉంది

ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉంది

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి బీజేపీ(BJP) అవసరం చాలా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో నడ్డా పాల్గొని ప్రసంగించారు. విజయవాడలో సమావేశం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ అభివృద్ధిపై సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని సూచించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో పది వేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయన్నారు. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు తెలిపారు.కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలని ఆదేశించారు. స్థానిక సమస్యలపై ప్రతి బూత్ కమిటీలో చర్చించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీగా మార్చిందని అన్నారు. ఆరోగ్యశ్రీ జగన్ పథకం కాదని.. కేంద్ర ప్రభుత్వ పథకమని చెప్పుకొచ్చారు. సౌభాగ్య కార్యక్రమం రెండున్నర కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు.