డాలస్లో శ్రీనివాసుడి కల్యాణంటీపాడ్ నేతృత్వంలో జూన్ 25న విశేష పూజాకార్యక్రమం
ఏడుకొండలవాడు.. శ్రీనివాసుడు… తన దేవేరులతో కలిసి తిరుమల కొండ దిగి సముద్రాలు, ఖండాలు దాటి అమెరికా వస్తున్నాడు. డాలస్లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్లో తెలుగువారితో సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలందుకోనున్నాడు.. జూన్ 25వ తేదీన అలెన్ ఈవెంట్ సెంటర్ (క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్) వేదికగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) భక్తి ప్రపత్తులతో చేపడుతున్న ఈ విశేష కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా దేవదేవతల ప్రతిరూపాలను, పూజారులను వెంటబెట్టుకుని రానున్నారు. డాలస్లో ఉంటున్న తెలంగాణ, తెలుగు, హిందూ ప్రజలందరికీ వెంకన్న దర్శనం, విశేషసేవల్లో భాగస్వాములయ్యే భాగ్యం కల్పించేందుకు టీపాడ్ తగిన ఏర్పాట్లను చేస్తున్నది. కాగా, పద్మావతీ అలిమేలు సమేత శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డూ ప్రసాదం, విశేష పూజల్లో భాగస్వాములయ్యే వారికి తిరుమల లడ్డూతో పాటు వస్త్రం అందజేయనున్నట్టు టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. వైభవంగా నిర్వహించే స్వామివారి విశేష సేవా కైంకర్యాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. తిరుమల వెంకన్న దర్శనభాగ్యం డాలస్లో కల్పించడం పట్ల స్థానికంగా ఉంటున్న తెలుగు వారితో పాటు హిందువులంతా సంబరపడుతుండగా, ఈ అవకాశం తమకు దక్కడమనేది దైవకృప అని, ఏడుకొండల వాడి ఆజ్ఞ వల్లే ఈ కార్యక్రమం చేయగుగుతున్నామని టీపాడ్ ప్రతినిధులు వివరించారు. అందరూ ఆహ్వానితులేనని, పార్కింగ్ కూడా ఉచితమని తెలిపారు.