*పులివెందులలో ఏపీ సీఎం జగన్ ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించారు. అక్కడ కొలతలు తీసుకున్నారు. సీఎం జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి నివాస ప్రాంతాలను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు.
సర్వేయర్లతో కొలతలు తీయించారు. కొంత కాలంగా వైఎస్ వివాకా హత్య కేసులో సైలెంట్గా ఉన్న సీబీఐ అధికారులు హఠాత్తుగా విచారణ ప్రారంభించి. నేరుగా సీఎం జగన్ ఇంటిని పరిశీలించడం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ కేసు పులివెందులలోని సీఎం జగన్ ఇంటి వైపు వెళ్లలేదు. వైఎస్ వివేకాతో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి.. అవినాష్ రెడ్డి.. మరికొందరి ఇళ్ల చుట్టూ తిరిగింది. కానీ అనూహ్యంగా జగన్ ఇంటినికూడా పరిశీలించి..కొలతలు తీసుకోవడం ఇప్పుడు కాక రేపే చాన్సులు కనిపిస్తున్నాయి. కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న టెన్షన్ కొంత మందిలో ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో దర్యాప్తు జరుపుతున్న సీబీఐపై ఒత్తిడి తెచ్చేందుకు అనేకప్రయత్నాలు జరిగాయి.సీబీఐ దర్యాప్తు అధికారితో పాటు అప్రూవర్గా మారిన దస్తగిరిపైనా కేసులు పెట్టారు. ఈ పరిణామాలతో.. సీబీఐ మరింత దూకుడు పెంచింది. సీఎం జగన్ ఇంటి పరిశీలనకు దారి తీసిన పరిస్థితిలేమిటో ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో కీలకమైనపెద్దల ప్రమేయం ఉందని అందరూ ఆరోపిస్తున్న సమయంలో సీబీఐ సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*నీరు, చెట్టు పథకం కింద టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.170 కోట్లు విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నీరు, చెట్టు పనులపై విజిలెన్స్ విచారణను ప్రభుత్వం చేపట్టింది. అవకతవకలు లేవని అధికారులు నిర్ధారించారు. థర్డ్ పార్టీ విచారణ చేయిస్తామని చెప్పడంతో ఇంజినీర్లు ఎదురు తిరిగారు. నీరు, చెట్టు పథకం కింద చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. వేసవి సెలవులు పూర్తి అయిన అనంతరం వెంటనే హైకోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో ప్రభుత్వం బిల్లులను విడుదల చేసింది. 45 కోట్లకు ఒక జీఓ, 122 కోట్లకు మరొక జీఓను అధికారులు విడుదల చేశారు. వెంటనే బిల్లులు ఇవ్వాలని జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
*జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రభుత్వమే నిందితులను కాపాడుతోందని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండిసంజయ్ ఆరోపించారు. ఘటనపై ఆయన స్పందిస్తూ ప్లాన్ ప్రకారమే గ్యాంగ్రేప్ ఘటన జరిగిందని అన్నారు. రఘునందన్రావు, రాజాసింగ్, బీజేపీ కార్యకర్తలపై కేసులు అన్యాయం పెట్టడం అన్యాయమని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆదేశిస్తే తప్ప..పోలీసులు స్పందించలేని పరిస్థితి వుందన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే తెలంగాణలో అఘాయిత్యాలు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కారు సీజ్ చేయడంలో కావాలనే పోలీసుల జాప్యం చేశారన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి దోషులను కాపాడుతున్నాయని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు.
* కాంగ్రెస్ పార్టీ చట్టానికి కట్టుబడి ఉంటే పార్టీ అని, తమ నేతలకు ఎలాంటి దాపరికాలు లేవని , ఈడీ ముందు దాచిపెట్టేదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ ముందు తమ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పింది. తమను చూసి బీజేపీ నేతలు పాఠాలు నేర్చుకోవాలని చురకలు వేసింది. నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ డీల్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు విచారణకు హాజరుకావాలని సోనియాగాంధీని ఈడీ కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా స్పందించింది.
* దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరోగిపోతున్నాయని, హైదరాబాద్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే పబ్బులు, అందులో అన్ని ఆ సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పబ్బుల మీద ప్రభుత్వానికి పట్టింపు ఏది? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక ఘటన దారుణమన్నారు. అలాగే నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. పబ్బు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసు వెనుకాల పెద్ద వాళ్ళ హస్తం ఉంది..అందుకే కేసు ఆలస్యం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పబ్బులు మూసి వేయాలన్నారు. దానికి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఘటనను సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 10 వ తేదీ మగ్ధూమ్ భవన్లో వామపక్ష పార్టీల సమావేశం ఉంటుందన్నారు. అందులో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పెరుగుతున్న చార్జీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాలపై కూడ చర్చ ఉంటుందన్నారు.
* అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని బిజెపి రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జంగల్రాజ్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్లో..కేటీఆర్ ట్విటర్లో మాత్రమే కనిపిస్తున్నారని చెప్పారు. హోంమంత్రి సెలవుల్లో ఉన్నారంటూ తరుణ్చుగ్ విమర్శించారు.జూబ్లీ హిల్స్ ఘటనపై ఆయన స్పందించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అమలు కావట్లేదని, శాంతి భద్రతలు దిగజారాయని అన్నారు. జూబ్లీహిల్స్ ఘటనపై సీబీఐతో విచారణ జరపించాలని తరుణ్చుగ్ డిమాండ్ చేశారు
*కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. భారత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో ఉన్న అభివృద్ధి అవకాశాలపై కేంద్ర మంత్రితో కేటీఆర్ చర్చించారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, సురేశ్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.
*సంచలనం రేపిన జూబ్లీల్స్ మైనర్ బాలిక రేప్ ఘటనకు సంబంధించి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులు ఎవరైనా సరే తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి రుజువైందన్నారు.పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.పోలీసులపై ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణ పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారనేదానికి ఎఎంకేసులో ఆరుగురిని అరెస్ట్ చేయడం అందుకు నిదర్సనమని అన్నారు. తమను బ్లేమ్ చేసేందుకు కొన్ని రాజకీయంగా శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు.
*గుంటూరు : జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు నిరసనకు దిగారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలోకి వచ్చి అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పార్టీ కార్యాలయంలోకి ఎందుకు వచ్చారని పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
*ఏపీలో గడపగడపకు కార్యక్రమం విఫలమైంది. గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సమస్యలపై వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను గడపగడప కార్యక్రమం చాటిచెప్పింది. ఈ నేపథ్యంలోనే గడపగడపపై సీఎం జగన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాపుకు రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైనారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు జగన్ పలు సూచనలు చేశారు. ‘గడపగడప’ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగుతుందని, ఒక్కో గ్రామంలో 2 రోజులపాటు నిర్వహించాలని సీఎం సూచించారు. నెలలో 20 రోజులు గడపగడపకు వెళ్లాలని సూచించారు. నెలకోసారి వర్క్షాప్ నిర్వహిస్తామని జగన్ ప్రకటించారు.
*మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. నుపుర్ శర్మను అరెస్టు చేయాలనే డిమాండ్తో గుజరాత్లోని సూరత్లో ఒక బ్రిడ్జిపై తాజాగా పోస్టర్లు వెలిశాయి. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో నుపర్ శర్మ చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి నిరసనలు మొదలయ్యాయి. పార్టీ నుంచి ఆమెను బీజేపీ సస్పండ్ చేసినప్పటికీ పలు ముస్లిం దేశాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. మతపరమైన మనోభావాలను నుపర్ శర్మ దెబ్బతీశారంటూ ముంబై సహా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అన్ని మతాలను తాము గౌరవిస్తామని బీజేపీ ప్రకటన చేయగా, తన వ్యాఖ్యలకు గాను నుపుర్ శర్మ బేషరతుగా క్షమాపణ చెప్పారు.
* వియత్నాం అధ్యక్షుడు న్యూయెన్ జువాన్ పిక్ను భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆగ్నేయ ఆసియా పర్యటనకు వెళ్లిన రాజ్నాథ్.. మంగళవారం వియత్నాం చేరుకున్నారు. అనంతరం రాజధాని హానోయ్లోని వియత్నాం జాతిపిత హో చి మిన్ సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరం వియత్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక బుధవారం ఆ దేశాధినేతను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
*నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన బుధవారం.. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సేవాకాలం నివేదన, మంగళాశాసనాలు, శాత్తుమోరై, వేద విన్నపాలు, ద్వారా తోరణ ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం మూలమంత్రమూర్తి మంత్రహవనం, పంచసూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్యపూర్ణాహుతి, నివేదన, మంగళాశాసనములు, వేద విన్నపాలు, శాత్తుమోరై, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
*చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్ రవి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. సోమవారం రాత్రి మద్యం బాటిళ్లు, రాళ్లు విసిరి వీరంగం సృష్టించారు. మంగళవారం ఉదయం టీడీపీ నాయకులు, కార్యకర్తలు రవి ఇంటివద్దకు చేరి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాల్సిందిగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో గంగమ్మ గుడికి చిట్టచివరి చైర్మన్ అయిన రవి వద్ద ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, వాటిని ఇవ్వాలని వైసీపీ నేత, రెస్కో చైర్మన్ సెంథిల్ ఫోను చేశారు. అటువంటివేవీ తన వద్ద లేవని, పార్థసారథి ప్రమాణ స్వీకార సమయంలో (ఆ తర్వాత మాజీ అయిన పార్థసారథి, ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు) వాటిని దేవదాయశాఖ అధికారులకు అప్పగించానని సెంథిల్కు చెప్పినట్లు రవి తెలిపారు. ఆయన వినకుండా వాటిని ఇవ్వాలని ఒత్తిడి పెంచారన్నారు. ఉదయం ఎండోమెంట్ అధికారులతో మాట్లాడుదామని చెప్పానని, ఆ తర్వాత పదిన్నర గంటలకు సెంథిల్ అనుచరులు మందుబాటిళ్లు, రాళ్లు ఇంటిపై విసురుతూ, దుర్భాషలాడుతూ వీరంగం చేశారని తెలిపారు. ఈ దాడికి నిరసనగా టీడీపీ శ్రేణులు ధర్నా చేశాయి. రెస్కో చైర్మన్ సెంథిల్తోపాటు ఆయన అనుచరులు కొందరిని నిందితులుగా పేర్కొంటూ కుప్పం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
*ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుతో ఆందోళనల్లో పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేసి, వారి ప్రొబేషన్కు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉద్యోగ సంఘాల పిలుపుతో ఆందోళనల్లో పాల్గొన్న కొందరిపై శ్రీకాకుళం, కృష్ణా తదితర జిల్లాల్లో కేసులు పెట్టారని, వీటి వల్ల తమ ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు.
*ఈ నెల 16న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ మూడో సమావేశం జరగనున్నది. హైదరాబాద్ జల సౌధలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని మంగళవారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారం అందించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో జల విద్యుత్తు, కృష్ణా నది వరద జలాలపై చర్చించనున్నారు.
*తన దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను కిరాతకంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఆ పదవి నుంచి తక్షణం బర్తరఫ్ చేయాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు తెలుగుదేశం పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పీతల సుజాత, ఎంఎస్ రాజు, పిల్లి మాణిక్యాలరావు మంగళవారం విజయవాడలోని రాజ్భవన్లో వినతిపత్రం అందజేశారు. స్థానిక పోలీసు యంత్రాంగం ఈ హత్య కేసులో ఎమ్మెల్సీని కాపాడే ప్రయత్నం చేస్తోందని, న్యాయం జరగడానికి వీలుగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగించాలని వారు కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
*‘రాష్ట్రానికి ఏమిచ్చారని మాట్లాడతారు? విభజన చట్టంలో ఉన్నవేమైనా నెరవేర్చారా? ప్రత్యేక హోదా ఏమైంది..! పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నారా? మూడేళ్లుగా మత చిచ్చుకు యత్నిస్తున్న బీజేపీకి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు లేదు’’ అని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చి చెప్పారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘75 లక్షల మందికి పునరావాసానికి నిధులు ఇస్తామని ప్రకటించారు. అవి ఇంకా ఇవ్వలేదెందుకు? విపక్షాలను వేధిస్తోంది ఎవరు? ఈడీ, సీబీఐ పేరుతో పువ్వు పార్టీ ఏం చేస్తోంది? ఈడీ, సీబీఐ పేరిట ఎంతమంది విపక్ష నేతలను జైళ్లకు పంపారో? నడ్డా, ఆరోగ్యశ్రీకి ఎంతిస్తున్నావు? జగన్ పథకాలు దేశమంతా అమలు చేస్తున్నాయి. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలైనా చేశారా?’’ అని నిలదీశారు. బీజేపీ, జనసేన, టీడీపీ గతంలో కలసి గోక్కున్నారని, తన్నుకుని బజార్నపడ్డారని .. ఇప్పుడు వారే సిగ్గు లేకుండా చెట్టాపట్టాలు వేసుకుంటున్నారని విమర్శించారు. జగన్ అమలు చేస్తున్న అమ్మఒడిలో కేంద్రం డబ్బులున్నాయా? మితిమీరి అప్పులు చేస్తుంటే కేంద్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది?’ అని నడ్డాను పేర్ని ప్రశ్నించారు.
*విశాఖపట్నంలోని గంగవరం పోర్టుకు అతి పెద్ద నౌక వచ్చింది. ఎంవీ మారన్ ఫిడిలిటీ పేరు గల ఈ నౌక ద్వారా అదానీ కంపెనీ సరకులు దిగుమతి చేసుకుంది. ఇప్పటివరకు గంగవరం పోర్టు 2,05,429 టన్నుల సామర్థ్యం కలిగిన నౌకలను హ్యాండిల్ చేయగా, మారన్ ఫిడిలిటీ ద్వారా 2,21,083 టన్నులు హ్యాండిల్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు పోర్టు పేర్కొంది.
*‘‘ప్రజల్లో కోర్కెలు ఎక్కువ అవుతున్నాయి. విపరీతమైన డిమాండ్లు. మాకున్న వనరులు తక్కువ. అన్నింటికీ పంచేటప్పటికి తక్కువైపోతుంది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తగినన్ని నిధులుంటే ప్రజల కోర్కెలు తీర్చేవాళ్లం. అన్నీ తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం పెరగాలి. ఆదాయం మీరు పెంచాల్సిందే. వేదికపై ఉండే మేం పెంచలేం. వ్యవసాయం చేస్తే దానివల్ల రాబడి వస్తుంది. పరిశ్రమలు వస్తాయి. కాబట్టి మీరు (రైతులు) రాష్ట్రానికి రాబడి ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న పద్ధతిలో ప్రజల కోర్కెలు తీరుస్తాం’’ అని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. మంగళవారం కడపలో జరిగిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘‘సీఎం ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు. అయితే ఈ మధ్య కొద్దిగా తెలుసుకున్నారు. ఇప్పుడేమైందంటే వ్యయసాయం వెనక్కిపోతోంది. రైతు ప్రభుత్వంపై కోప్పడ్డాడంటే ఆ ప్రభుత్వం నిలబడదు. రైతులు ఏమి అడుగుతారు? పొలాలకు నీళ్లు. సమయానికి మంచి విత్తనాలు ఇస్తే ఎన్నికలు వచ్చినప్పుడు దీవిస్తారు. రైతులు మాకు బరువు కాదు. ప్రభుత్వాలే రైతులపై ఆధారపడతాయి’’ అని అన్నారు.
*అరేబియా సముద్రంలో పడమర గాలులు బలపడడంతో నైరుతి రుతుపవనాల్లో స్వల్ప పురోగతి కనిపించింది.
మంగళవారం కర్ణాటక, తమిళనాడుతోపాటు పుదుచ్చేరి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో ఉత్తర తమిళనాడుకు ఆనుకుని సముద్రంలో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో కర్ణాటక, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ, తమిళనాడు, కర్ణాటకల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం, అదే సమయంలో వర్షాలు పెరగడంతో బహుశా బుధ, గురువారాల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమ వరకు విస్తరించవచ్చునని వివరించారు. కాగా మంగళవారం కోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. అమరావతిలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో కోస్తాలో ఎండలు పెరుగుతాయని నిపుణులు వివరించారు. వచ్చే 24 గంటల్లో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో, కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
*పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు ఇద్దరు స్టేట్ సెకండ్ మార్కులు(596) సాధించి విజయకేతనం ఎగురవేశారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు, డైరెక్టర్ సీమ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నలుగురు 595 మార్కులు, పదిమంది 594 మార్కులు, 26 మంది 593 మార్కులు, 145 మంది 590కిపైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. గణితంలో 1842 మంది, సైన్స్లో 1127 మంది, తెలుగులో 978 మంది నూటికి నూరు మార్కులు సాధించినట్టు తెలిపారు. 35 బ్రాంచీల్లో నూరు శాతం ఉత్తర్ణత సాధించామని, సగటు మార్కులు 488, ఓవరాల్ పాస్ పర్సంటేజీ 94.45 అని వివరించారు.
* పదో తరగతి పరీక్షల నిర్వహణ తీరుపై సీబీఐ విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన చేశారు. కాగా, వైసీపీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిందని, పది ఫలితాలే ఇందుకు నిదర్శనమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.
*అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ సందర్భంగా ఈనెల నాలుగోతేదీ నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గురువారం (తొమ్మిదో తేదీ) ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి.మహాసంప్రోక్షణకు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఆలయం ఎదురుగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. 40 మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. మూడు స్వాగత ద్వారాలు, నగరంలోని ముఖ్యమైన 50 ప్రాంతాల్లో మహాసంప్రోక్షణకు భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఆలయం నుంచి ప్రధాన రోడ్డుకు అప్రోచ్ రోడ్డు, రెండులైన్ల బ్యారికేడ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంలో సేవలందించేందుకు వివిధ విభాగాల నుంచి దాదాపు 400 మందిని డిప్యుటేషన్పై నియమించారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భజన బృందాల వారు కలిపి రెండువేల మంది రానున్నారు.గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలను టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తిచానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
*గుంటూరు : జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు నిరసనకు దిగారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలోకి వచ్చి అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పార్టీ కార్యాలయంలోకి ఎందుకు వచ్చారని పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
*ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇవాళ ఉదయం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సీజేకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం లడ్డూ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.కాగా తిరుమలలో నిన్న శ్రీవారిని 76,425 మంది భక్తులు దర్శించుకోగా 36,053 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.15 ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం 27 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 8 గంటలో దర్శనం కానున్నదని వివరించారు.
* ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి దర్శన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్కు జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.ఇవాళ ఉదయం ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారిని 76,425 మంది భక్తులు దర్శించుకోగా 36,053 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.15 ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం 27 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 8 గంటలో దర్శనం కానున్నదని వివరించారు.