Politics

కుప్పం మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా ?

కుప్పం మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా ?

కుప్పం మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా ?: సీఎం జగన్‌
వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని వైకాపా అధినేత, సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైకాపా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మన లక్ష్యమని.. ఇది కష్టం కాదని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ పై.. వర్క్‌షాపు జరుగుతోంది. ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరగాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు.. ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయించాలని సూచించారు. నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరగాలని ఆదేశించారు.
గడపగడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నామో చూసుకోవాలన్న సీఎం.. ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై నిరంతరం చర్చించుకోవాలన్నారు. దీనికోసం ఇకపై నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. చరిత్రలో ఒక ముద్ర వేశామన్న సీఎం.. సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామన్నారు. ఇక చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును తీసుకోవడమేనని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

‘‘కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్లీన్‌ స్వీప్‌ చేస్తామనుకున్నామా? కష్టపడితే రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించగలుగుతాం. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిరంతర కార్యక్రమం. దాదాపు 8 నెలల పాటు ఇది కొనసాగుతుంది. ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులు దీనికి కేటాయించాలి. నెలలో ఒక్కో సచివాలయంలో రెండేసి రోజులు చొప్పున 10 సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఇకపై నెలకు ఒకసారి వర్క్‌షాప్‌ నిర్వహిస్తాం. మనకు వచ్చిన స్పందనపై వర్క్‌షాప్‌లో చర్చిస్తాం. నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని వాటిపై చర్చిస్తాం. ప్రజల నుంచి అందే విజ్ఞాపనలు, వాటి పరిష్కారమే ముఖ్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది’’ -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

పనితీరు ఆధారంగానే సీట్లు: ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. నేతల పనితీరుపై ఐ ప్యాక్ రోజువారీ సర్వే నివేదికను ఎమ్మెల్యేల ముందుంచారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికంగా, తక్కువగా పాల్గొన్న ఎమ్మెల్యేల జాబితాను ప్రదర్శించారు. క్షేత్రస్థాయిలో తక్కువగా పర్యటించిన ఎమ్మెల్యేలు, నేతలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒక్కరోజూ తిరగలేదని జగన్ తెలిపారు. నెలలో ఒక్కరోజూ తిరగనివారిలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉన్నారన్నారు.శ్రీశైలం, చీపురుపల్లి, పులివెందుల నియోజకర్గాలకు కార్యక్రమం నుంచి మినహాయింపునిచ్చామన్నారు. 6 నెలల్లో గ్రాఫ్ పెంచుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పనితీరు ఆధారంగా నేతల భవిష్యత్తు నిర్ణయిస్తానని జగన్ స్పష్టం చేశారు. పనితీరు మారకపోతే భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. పనితీరు ఆధారంగా నేతలకు సీట్లు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.