DailyDose

లాలూకు ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా విడుదల

లాలూకు ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా విడుదల

కోడ్‌ ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిర్దోషిగా విడుదలయ్యారు. 13 ఏళ్ల నాటి కేసు విచారణ నిమిత్తం జార్ఖండ్‌లోని పాలము కోర్టుకు లాలూ హాజరవగా.. విచారణ అనంతరం కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే, ఆయనకు కోర్టు రూ.6వేల జరిమానా విధించింది. ఈ కేసులో లాలూకు విముక్తి లభించిందని, ఇకపై ఆయన కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది ధీరేంద్ర కుమార్‌ తెలిపారు.కోర్టు తీర్పు అనంతరం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెళ్లిపోయారు. కేసు వివరాల్లోకి వెళితే.. 2009 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలము జిల్లాలోని గర్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున గిరినాథ్ సింగ్ బరిలో నిలిచారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన ప్రచారం కోసం హెలికాప్టర్‌లో గర్వా చేరారు. ఇక్కడి గోవింద్ హైస్కూల్ లో ఆయన ఎన్నికల సమావేశం జరగనుంది. హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి గర్వా బ్లాక్‌లోని కల్యాణ్‌పూర్‌లో హెలీప్యాడ్‌ను నిర్మించారు.

దీనికి అధికారులు అనుమతి ఇవ్వగా.. నిర్ణీత హెలీప్యాడ్‌లో దిగకుండా గోవింద్ హైస్కూల్ మైదానంలోని సభాస్థలంలో దింపారు. దీంతో సమావేశంలో ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు లాలూపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే కేసు విచారణ సందర్భంగా ఆయన ఇవాళ పాలము కోర్టుకు చేరారు. 28 నిమిషాల పాటు ఆయన కోర్టులో ఉన్నారు. ఈ కేసులో లాలూ ఇప్పటికే నెలన్నర జైలు జీవితం గడిపారు.