DailyDoseSports

‘ఐపీఎల్ వారి పాట’కు రికార్డులు బద్దలు.. రూ. 45 వేల కోట్లకుపైనే!

‘ఐపీఎల్ వారి పాట’కు రికార్డులు బద్దలు.. రూ. 45 వేల కోట్లకుపైనే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్‌ లీగ్‌గా ఇప్పటికే చరిత్ర సృష్టించిన భారత టీ20 లీగ్‌.. మరో భారీ జాక్‌పాట్‌ కొట్టబోతుంది. సీజన్‌ సీజన్‌కు ఊహించని రీతిలో పెరుగుతున్న లీగ్‌ విలువ కారణంగా సరికొత్త రికార్డులు నమోదు కాబోతున్నాయి. మీడియా ప్రసార హక్కుల కోసం రూ.వేల కోట్లు కుమ్మరించేందుకు దిగ్గజ సంస్థలు సై అంటున్నాయి. లీగ్‌లో జట్లు పదికి చేరడంతో వచ్చే అయిదేళ్ల కాలానికి గాను ఈ హక్కుల కోసం రికార్డు ధర పలకడం ఖాయం అంటున్నారు క్రికెట్​ విశ్లేషకులు.

కాసుల వర్షం కురిసే ఐపీఎల్​ లీగ్‌లో మరోసారి రూ.వేల కోట్లు ఖజానాలో చేరే సమయం ఆసన్నమవుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మీడియా హక్కుల కోసం నిర్వహించే ఈ- వేలం ఆదివారం ఆరంభమవుతుంది. 2023 నుంచి 2027 వరకు అంటే అయిదేళ్ల కాలానికి గాను ఈ హక్కుల కోసం సుమారు రూ.45 వేల కోట్ల ధర పలుకుతుందని బీసీసీఐ అంచనా వేస్తోంది. 2017లో స్టార్‌ ఇండియా 2018-2022 కోసం రూ.16,347.50 కోట్లకు (టీవీ, డిజిటల్‌ ప్రసారాలు) ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికీ అదే సరికొత్త రికార్డు. ఈ సారి ఆ రికార్డు బద్దలవడం ఖాయం. ఎందుకంటే కనీస ధరనే రూ.32,440 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. దాని కంటే కనీసం రూ.12,500 కోట్ల వరకు అధిక ధర పలుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మొత్తం ధర రూ.45 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. టీవీ, డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రసారాల హక్కుల కోసం డిస్నీ స్టార్‌, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, సోనీ, జీ లాంటి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ రేసు నుంచి అమెజాన్‌ శుక్రవారం తప్పుకుంది. “వేలం నుంచి అమెజాన్‌ తప్పుకుంది. సాంకేతిక బిడ్డింగ్‌ ప్రక్రియలో ఆ సంస్థ చేరలేదు. మరోవైపు యూట్యూబ్‌ కూడా బిడ్‌ దరఖాస్తు తీసుకుంది కానీ ఇప్పటికీ దాన్ని సమర్పించలేదు. దీంతో టీవీ, స్ట్రీమింగ్‌ పరంగా చూసుకుంటే 10 సంస్థలు హక్కుల కోసం బరిలో నిలిచాయి” అని ఓ సీనియర్‌ బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు.

తొలిసారి ఈ- వేలం..
టీ20 లీగ్‌ మీడియా హక్కుల కోసం తొలిసారి బీసీసీఐ ఈ- వేలం నిర్వహిస్తుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ప్రత్యేకంగా ముగింపు తేదీని ప్రకటించలేదు. కానీ సోమవారం లేదా మంగళవారం ఇది ముగిసే అవకాశం ఉంది. మిగతా సంస్థలన్నీ పక్కకు తప్పుకుని, అత్యధిక బిడ్‌ దాఖలయ్యే వరకూ ఈ వేలం కొనసాగుతుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సంస్థలు తమ బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక్కొక్క సంస్థ వేలం నుంచి తప్పుకుంటూ చివరకు ఒక్కటి మాత్రమే మిగిలేంత వరకూ వేలం జరుగుతుంది. సంస్థలు వేసిన బిడ్లు ఎప్పటికప్పుడూ ప్రత్యక్షంగా తెర మీద కనిపిస్తాయి. కానీ వాటి పేర్లు మాత్రం బయటపెట్టరు. చివరకు అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు.నాలుగు ప్యాకేజీలు.. ఈ మీడియా ప్రసార హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ ‘ఎ’లో భారత ఉపఖండ టీవీ హక్కులు, ‘బి’లో భారత ఉపఖండ డిజిటల్‌ హక్కులు, ‘సి’లో ప్లేఆఫ్స్‌తో సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌ల డిజిటల్‌ హక్కులు (భారత ఉపఖండంలోనే), ‘డి’లో భారత్‌ మినహా మిగతా ప్రపంచ దేశాల్లో టీవీ, డిజిటల్‌ హక్కులు చేర్చారు. ప్యాకేజీ ‘సి’లో భాగంగా ప్రత్యేక మ్యాచ్‌లంటే.. సీజన్‌ ఆరంభ, వారాంతాల్లో జరిగే సాయంత్రం మ్యాచ్‌లు, ఫైనల్‌ సహా నాలుగు ప్లేఆఫ్స్‌ ఉంటాయి. సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యను బట్టి వీటిని నిర్ణయిస్తారు. ఒక సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరిగితే ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 18గా ఉంటుంది. ఈ ఒప్పందంలోని చివరి రెండు సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే అవకాశాలున్నాయి. అప్పుడు ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 22 అవుతుంది. ఈ ఒక్కో ప్యాకేజీలో ఒక్కో మ్యాచ్‌ ధర వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే ధరనే సంస్థలు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. చివరకు అన్ని మ్యాచ్‌లకు కలిపి వాటిని లెక్కగట్టి అయిదేళ్ల కాలానికి ఎంత అవుతుందో తేలుస్తారు. ఒక్కో సంస్థ ఎన్ని ప్యాకేజీలకైనా బిడ్లు దాఖలు చేయవచ్చు.

ఒక్కో మ్యాచ్‌కు రూ.49 కోట్లు..
ప్యాకేజీల పరంగా ఒక్కో మ్యాచ్‌కు కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ‘ఎ’లో మ్యాచ్‌లకు అది రూ.49 కోట్లుగా ఉంది. బీ, సీ, డీలకు వరుసగా రూ.33 కోట్లు, రూ.11 కోట్లు, రూ.3 కోట్లుగా నిర్ణయించారు. మొత్తంగా ప్యాకేజీ ‘ఎ’ కనీస ధర చూసుకుంటే 74 మ్యాచ్‌లు × రూ.49 కోట్లు × అయిదు సీజన్లు.. అంటే మొత్తం రూ.18,130 కోట్లు అవుతుంది. ఇలా మొత్తం నాలుగు ప్యాకేజీలు కలిపి కనీస ధరను రూ.32,440 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది.