Politics

రాజ్యసభ ఎన్నికల్లో వికసించిన కమలం.. నాలుగు రాష్ట్రాల్లోనూ సత్తా

రాజ్యసభ ఎన్నికల్లో వికసించిన కమలం.. నాలుగు రాష్ట్రాల్లోనూ సత్తా

రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భాజపా సత్తాచాటింది. శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార భాజపా 8, విపక్ష కాంగ్రెస్ 5 సీట్లను దక్కించుకున్నాయి. అగ్రనేతలు నిర్మలా సీతారామన్, రణదీప్​ సుర్జేవాలా, సంజయ్​ రౌత్​ పెద్దల సభకు ఎన్నికయ్యారు.

16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అధికార భాజపా 8, విపక్ష కాంగ్రెస్ 5 సీట్లను కైవసం చేసుకున్నాయి. శివసేన, ఎన్‌సీపీ చెరో సీటును దక్కించుకోగా.. హరియాణాలో భాజపా మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార మహావికాస్ అఘాడీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు స్థానాలకు గానూ భాజపా మూడు స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎస్‌సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి.. ప్రతాప్ గర్హీ పెద్దల సభకు ఎన్నికయ్యారు. శివసేన మరో అభ్యర్థి సంజయ్ పవార్​ ఓటమి పాలయ్యారు.

కర్ణాటకలో నాలుగు స్థానాలకుగానూ భాజపా మూడు, కాంగ్రెస్ ఒక సీటు దక్కించుకున్నాయి. భాజపా నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు జగ్గేశ్, ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ కేంద్రమంత్రి.. జైరాం రమేశ్ గెలుపొందారు. ఎన్నికల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. రాజస్థాన్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ మూడు స్థానాలను కైవసం చేసుకోగా భాజపాకు ఒకసీటు దక్కింది. కాంగ్రెస్ నుంచి రణ్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ పెద్దలసభకు ఎన్నికకాగా.. భాజపా నుంచి ఘన్‌శ్యామ్ తివారీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. భాజపా మద్దతుతో.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమిపాలయ్యారు. భాజపా ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేశారు. దీంతో శోభారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని భాజపా రద్దుచేసింది.హరియాణాలోని రెండు స్థానాల్లో భాజపా అభ్యర్థి క్రిష్ణన్‌ లాల్ పన్వార్, భాజపా మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ విజయం సాధించారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రాస్‌ ఓటింగ్ వేయడం, మరో ఎమ్మెల్యే ఓటు చెల్లకపోవటం వల్ల కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఓటమిపాలయ్యారు.

అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర, హరియాణాల్లో కౌంటింగ్ జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు నిబంధనలను ఉల్లంఘించారనే ఫిర్యాదులతో కౌంటింగ్ సుమారు 8 గంటల పాటు నిలిచిపోయింది. అనంతరం ఈసీ ఆదేశంతో అర్థరాత్రి ఒంటిగంటకు తిరిగి ప్రారంభమైంది.