దేశంలో అమాయకుల ప్రాణాలు తీస్తున్న తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ Americans గళమెత్తారు. ప్రాణాలు తీస్తున్న ఆయుధాలను నియంత్రించాల్సిందేనని చట్టసభ్యులను డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలకు వ్యతిరేకంగా ఇలా వారు కదంతొక్కారు. వాషింగ్టన్లోని స్మారక మైదానం నేషనల్ మాల్ వద్ద శనివారం వేల సంఖ్యలో అమెరికన్స్ భారీ ప్రదర్శన నిర్వహించారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరిట చేపట్టిన ఈ ర్యాలీలో సుమారు 50వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు గన్ కల్చర్కు చరమగీతం పాడేలా పార్లమెంట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలోని దాదాపు 45 రాష్ట్రాల్లో తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అమెరికన్లు తమ గళం వినిపిస్తున్నారు. ఇంతకుముందు 2018లో ఫ్లోరిడాలోని పార్క్ల్యాండ్లో జరిగిన కాల్పుల ఘటనలో 17 మంది చనిపోయిన సందర్భంలో కూడా ఇలాగే March For Our Lives పేరుతో అమెరికన్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇప్పుడు రెండోసారి గన్ కల్చర్కు తెరదించాల్సిందేనంటూ చట్ట సభ్యులను కోరుతున్నారు.