Politics

ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని వేధిస్తున్నారు

ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని వేధిస్తున్నారు

ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని వారి మనుషులతో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మూల్పూరి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. రాచేటి రూతమ్మ అనే మహిళతో తనను తీవ్ర పదజాలంతో తిట్టిస్తూ ఆడియో సంభాషణ పంపారని పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా గన్నవరంలో ఆయన విగ్రహం కనపడకుండా ఫ్లెక్సీలు కట్టి, సభావేదిక ఏర్పాటు చేశారని, దీనిని బహిరంగంగా నిలదీయడంతో వంశీ, ఆయన అనుచరులు తనపై సామాజిక మాధ్యమాల ద్వారా దాడికి దిగారన్నారు. ఈ నెల 10న తనను అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన ఆడియో సంభాషణ వాట్సప్‌ చేశారన్నారు. గన్నవరానికి చెందిన రూతమ్మ ఈ సంభాషణ చేసినట్లుగా తమ పరిశీలనలో తేలిందన్నారు. వైకాపా అరాచకాలు ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇలా దిగజారుడు రాజకీయం చేస్తున్నారంటూ ఆమె వాపోయారు. ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నామని ఎస్సై చెప్పారు.