అగ్ర కథానాయిక కియారా అద్వాణీ హిందీ చిత్రసీమలో ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న నలభైకిపైగా అభిమాన సంఘాలతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించింది. ఈ ఇష్టాగోష్టిలో అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. కెరీర్పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మున్ముందు ఎంచుకోవాల్సిన కథాంశాల గురించి అభిమానుల సలహాల్ని తీసుకుంది. అందమైన సాయంకాలం ఐదారుగంటలకు పైగా సాగిన ఆత్మీయ భేటీ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పింది కియరా అద్వాణీ. ‘అభిమానుల ప్రేమాభిమానాల వల్లే ఈ స్థాయికి వచ్చాను. వారి మాటలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి స్ఫూర్తినిచ్చాయి. భవిష్యత్తులో కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తా’ అని చెప్పింది కియారా అద్వాణీ. గత రెండేళ్లుగా బాలీవుడ్ చిత్రసీమలో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది కియారా అద్వాణీ. ‘కబీర్సింగ్’ ‘షేర్షా’ చిత్రాలు అగ్ర కథానాయికగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భూల్ భులయ్యా-2’ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కియారా అద్వాణీ విజయపరంపరకు ఎదురులేకుండా పోయింది.