Politics

ఈడీ విచారణకు హాజరైన రాహుల్‌ గాంధీ

ఈడీ విచారణకు హాజరైన రాహుల్‌ గాంధీ

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈడీలోని ఇద్దరు అధికారులు రాహుల్‌ గాంధీని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసులు ముందు ఏఐసీసీ నిరసనలను చేపడుతోంది. ఈ క్రమంలో బషీర్‌బాగ్‌ ఈడీ ఆఫీస్‌ ముందు తెలంగాణ కాంగ్రెస్‌ నిరసన చేపట్టింది. కేంద్రం కక్ష సాధింపుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేపట్టారు.అందులో భాగంగా నగరంలోని నెక్లెస్‌ రోడ్‌ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన చేపట్టారు. రాహుల్‌ విచారణ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఆఫీస్‌కు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , పలువురు కాంగ్రెస్ ఎంపీలు చేరుకున్నారు. కాగా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను కాంగ్రెస్‌ ప్రాయోజిత యంగ్‌ ఇండియా సంస్థ ద్వారా అక్రమ పద్ధతిలో హస్తగతం చేసుకున్నారంటూ మనీ ల్యాండరింగ్‌ చట్టాల కింద ఈడీ కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసు నిమిత్తమే రాహుల్‌ని ఈడీ విచారించనుంది.